శబరిమల అయ్యప్ప స్వామి 18 మెట్లు వెనుక ఉన్న రహస్యం ఇదే ...

శబరిమల  అయ్యప్ప స్వామి 18 మెట్లు వెనుక  ఉన్న రహస్యం  ఇదే ...

అయ్యప్ప అంటే ఠక్కున గుర్తుకువచ్చేది 18 మెట్లు. ...పదునెట్టాంబడి. ..అయితే అయ్యప్ప దీక్ష తీసుకున్నది మొదలు ఇడుముడి దేవుడికి సమర్పించేవరకు చేసే ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే శమరిమల 18మెట్ల విశిష్టత తెలుసుకుందాం…

శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను `పదునెట్టాంబడి` అంటారు. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తున్నాయని, అవి అయ్యప్ప దుష్టశక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలని పేర్కొంటారు. మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలను (కళ్లు, చెవులు, నాసిక, నాలుక, చర్మం) తరువాతి ఎనిమిది మెట్లు రాగద్వేషాలను ( తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారం) సూచిస్తాయి. తదుపరి మూడు మెట్లు సత్వ, తమో,రజో గుణాలకు ప్రతీక. 17 మరియు 18 మెట్లు విద్యను, అజ్ఞానాన్ని సూచిస్తాయి.

ఈ 18 మెట్లను ఒకమారు ఎక్కడానికి, మరోమారు దిగడానికి ఉపయోగించాలి. అలాగే 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలోఃపానవట్టంపైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు.

ఈ మెట్లను పరుశురాముడు నిర్మించాడని  ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. అష్టదిక్పాలకులు ఎనిమిది మంది (ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు), రెండు యోగములు (కర్మయోగం, జ్ఞానయోగం), విద్య , అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పరచారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కేముందు కొబ్బరి కాయను కొట్టి, నెయ్యితో స్వామివారికి అభిషేకం చేస్తారు.

ఆ తరువాత మాలికాపురత్తమ్మ అమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరి కాయలు దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుబడిగా చెల్లించుకుంటారు. ప్రతి ఏటా నవంబర్ మధ్య నుంచి మకర సంక్రాంతి  వరకు శబరిమలై భక్తకోటితో పులకించిపోతోంది. రెండున్నర మాసాల పాటు దక్షిణ భారతం శరణుఘోషతో మారు మ్రోగిపోతుంటోంది. ప్రతిరోజు  ఐదారులక్షల మంది అయ్యప్ప భక్తులు పంపానది తీరం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరం పాదయాత్రతో ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు.

అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే, పంపానది నుంచి4,135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానంకు చేరాల్సిందే. ఈ మార్గమే మనోదౌర్భాల్యాలనీ , శారీరక సౌఖ్యాలనీ మండించి బూడిద చేయగల దైవమార్గం. ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహరసుతుడు పెట్టే పరీక్షలు. వీటిలో నెగ్గితే మోక్షమార్గం కళ్లెదుట కనబడుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.