
హిందువులందరూ దాదాపు అందరూ పూజలు చేస్తారు. పూజకు పసుపు... కుంకుమ.. గంధంతో పాటు.. పుష్పాలు కూడా సమర్పిస్తుంటారు. ఏవో బయట చెట్లనుంచి లభించే పూలో.. బయట మార్కెట్లో దొరికే పూలో తీసుకొచ్చి పూజ చేస్తాం. కాని వీటన్నిటికంటే మనో పుష్పాన్ని భగవంతునికి సమర్పించాలంటున్నారు పండితులు. ఇప్పుడు మనో పుష్పం అంటే ఏమిటో.. అది ఎక్కడ లభిస్తుందో పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. .
పండితులు.. పురాణాలు చెప్పినట్లు భగవంతుడిని పూజించడానికి మనో పుష్పం చాలా ముఖ్యం. మనోపుష్పం అంటే మనస్సును భగవంతునిపై లగ్నం చేసి.. చిత్తశుద్దితో పూజించడమేని పురాణాల ద్వారా తెలుస్తుంది. భగవంతుడు సృష్టించిన పదార్ధాలతో తిరిగి భగవంతుని ఆరాధించటం కాకుండా, మనం మనో పుష్పాన్ని భగవంతునికి అర్పించటమే అనన్య భక్తి... ఈ మనో పుష్పం శుద్ధమై ఉండాలి. దానికి ముందు ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, శాంతి, క్షమా అహింసలు, తపము, ధ్యానం, సత్యం ఇవన్నీ సాధించాలి.. నిరంతరం తపన, సాధన చేయాలి.
Also Read : రంగుల పండుగ.. పురాణాల సారాంశం ఇదే
ప్రతీ జడ, జీవ పదార్ధము పరమాత్మ స్వరూపమే అనే అనుభూతి పొందాలి. విశ్వం అంతటా పరమాత్మ చైతన్యమే నిండి ఉంది అని తెలుసు కొంటేనే ఆ శక్తి మన మనసులో జడ, జంతు జీవాలలో ఉంది అని అర్ధం అవుతుంది. మనసు ఎపుడు కూడా బైటకే, బాహ్య వస్తువుల వైపే పరుగులు తీస్తూ ఉంటుంది.అలాంటి మనసుని శుద్ధి చేసుకొని అంతర్ముఖం చేయాలి.
మనసు, బుద్ధి ఏకమై ఆత్మలో లయం అవ్వాలి.. లేదా మనసే ఆత్మగా ప్రకాశించాలి. చిత్త శుద్ధి పొందిన మనసుని ఆత్మ లో ప్రతిష్టించాలి!
ఇలాంటి మనో పుష్పాన్నే భగవంతునికి సమర్పించాలి!ఇదే అనన్య భక్తి.. ఆత్మానుభూతి.
గృహస్తు అయినా, బ్రహ్మ చారి అయినా, సన్యాసి అయినా మనసు శుద్ధి చేసుకొంటే కానీ అసలైన భక్తుడు కాలేడు.చిత్తశుద్ధి లేని పూజ పరమాత్మ స్వీకరించడు... ముక్తి పొందాలంటే భక్తి కావాలి.. భక్తి అంటే అనన్య భక్తి కావాలి..సంపూర్ణ శరణాగతి.దీనికి చిత్త శుద్ధి, నిష్కామ కర్మలతో కూడిన నిరంతరం సాధన అవసరమని పురాణాలు చెబుతున్నాయి.
ప్రతీ మానవునిలో3 శరీరాలు ఉంటాయి.. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. కారణ శరీరంలోనే అనేక జన్మర్జిత పాపపుణ్యాలు బీజరూపంలో నిక్షిప్తం అయివుంటాయి.. వీటి వల్లనే అనేక వికారాలు వస్తూ ఉంటాయి జీవుడికి. వీటిని తొలగించుకోవాలంటే సూక్ష్మ శరీరం లో మార్పు రావాలి.
ఈ సూక్ష్మ శరీరంలో మార్పు రావాలి అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ స్థూల శరీరంతోనే ఏ సాధన అయినా చేయాలి. జీవాత్మ ఉన్నంత వరకే శరీరం పని చేస్తుంది. అందుకే శరీరంలో జీవం లేకపోతే ఏమీ చేయలేము కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అన్న చందంగా.. ఈ శరీరంలో ప్రాణం ఉండగానే, చిత్త శుద్ధి తో, నిష్కార్మ కర్మలతో, అనన్య భక్తి తో, సాధన చేస్తూ ఆత్మానుభూతి పొందాలి.