
ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటలో 18 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. తీవ్రగాయాలైన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అసలు ఈ మృత్యుఘోషకు కారణమేంటి? బాధ్యులెవరు అంటే... అధికారలు నిర్లక్ష్యమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
యూపీలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. రైలు వచ్చే సమయానికి ముందు 1500 జనరల్ టికెట్లు ఇచ్చారు రైల్వే అధికారులు. భారీ సంఖ్యలో ప్రయాణికులు ఫ్లాట్ ఫాం 12,13 దగ్గరకు చేరుకున్నారు. ఇంతలోనే ఎవరో ప్రయాగ్ రాజ్ వెళ్లే రైల్లు రద్దయ్యిందని కొందరు వదంతులు సృష్టించారు. అయితే అప్పటికే ఫ్లాట్ ఫామ్ 14 దగ్గర ప్రయాగ్ రాజ్ వెళ్లే రైలు ఆగి ఉంది. దీంతో ప్రయాణికులంతా ఫ్లాట్ ఫామ్ 14 దగ్గరకు పరుగులు పెట్టారు. బ్యాగులు,లగేజీలు,చిన్నపిల్లలను సైతం ఎత్తుకుని పరుగెత్తారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు కోల్పోగా మరి కొందరు స్పృహ తప్పి కింద పడిపోయారు. ఇదంతా 15 నుంచి 20 నిముషాల్లోనే జరిగిందని తెలుస్తోంది.
రైల్వే అధికారులు,ఢిల్లీ పోలీసుల విరుద్ధ ప్రకటనలు
అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడంతోనే తొక్కిసలాట జరిగిందని రైల్వే సీపీఆర్ వో అధికారులు ప్రకటన చేశారు. ఏ రైలు రద్దు చేయలేదని .. ప్లాట్ఫామ్ను మార్చలేదని అన్నారు. . అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ప్రయాణికులు ఫ్లాట్ ఫామ్ మారడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. రైల్వే అధికారులు, ఢిల్లీ పోలీసుల ప్రకటనలు విరుద్ధంగా ఉండటం గమనార్హం.
విచారణకు ఆదేశం
తొక్కిసలాట ఘటనపై కేంద్రం ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో వైపు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. రెండున్నర లక్షలు ,స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష పరిహార ప్రకటించింది.
రాష్ట్రపతి,ప్రధాని దిగ్ర్భాంతి
తొక్కిసలాట ఘటనపై ప్రదాని మోదీ,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యామని తెలిపారు. . గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.