బాబోయ్​ .. వానాకాలం... ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

బాబోయ్​ .. వానాకాలం... ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

వర్షాకాలం మొదలైంది. భారీగా వర్షాలు కూడా పడుతున్నాయి.  రుతువులు మారినప్పడు మన జీవనశైలికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి.  లేదంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  మరి వానల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. .. 

రుతువులు మారుతున్నపుడు వాటికి అనుగుణంగా మన జీవన శైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం తప్పని సరి. అప్పుడే ఆరోగ్యంగా ఆయా రుతువులను ఆస్వాదించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని  జాగ్రత్తలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. తాజా, వెచ్చని శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఉండే తేమ వాతావరణం వల్ల రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ సమయంలో రోగ నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

 

  • హెర్బల్ టీలు, సూప్ లు, అల్లం కషాయం వంటి వెచ్చని ద్రవాలను తీసుకోవాలి. ఇవి జీవక్రియల వేగం పెంచుతాయి. హైడ్రేటెడ్ గానూ ఉంచుతాయి.
  • పియర్స్, ఆపిల్, దానిమ్మ, చెర్రీస్ వంటి ఈ కాలంలో దొరికే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
  • వేపుళ్లు, కొవ్వు కలిగిన ఆహారాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. తేలికగా ఉండే తాజాగా వండిన భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. చేపలు, కూరగాయలు, తేలికైన ప్రొటీన్లు కలిగిన ఆహారాలు, తృణధాన్యాలను తీసుకోవాలి. ఇవి ఈ కాలంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తాయి. తేలికగానే జీర్ణమవుతాయి.
  • పెరుగు, మజ్జిగ వంటి ప్రొబయోటిక్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.
  • వర్షా కాలంలో ఆకుకూరల్లో సూక్ష్మక్రిములు ఉండవచ్చు. బచ్చలి, మెంతి ఆకుల వంటి వాటిని బాగా ఉడికించి తీసుకోవచ్చు.

వీటికి దూరంగా ఉండండి..

  • వర్షాకాలంలో స్ట్రీట్ ఫూడ్, సలాడ్‌లకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో నీటిలో పెరిగే బ్యాక్టీరియాతో వల్ల ఆహారం కలుషితం కావచ్చు. కలుషిత ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలను నివారించేందకు ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకోవడం మేలు.
  • నూనెలో వేయించిన పదార్థాలు, ఎక్కువ మసాలాలు కలిగిన పదార్థాలు ఎక్కువ తీసుకుంటే జీర్ణసమస్యలు వస్తాయి. అసిడిటి పెరగవచ్చు. కనుక వర్షాకాలంలో మసాలాలు కలిగిన కూరలు, కూర్మాలు, నూనెలో వేయించిన పకోడి, సమోసాల వంటివి తీసుకోకపోవడమే మంచిది.
  • పాలు, చీజ్, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు తేమ కలిగిన ఈ వాతావరణంలో త్వరగా చెడిపోతాయి. పాల పదార్థాలు తీసుకోవాలని అనుకుంటే తప్పకుండా అవి తాజావని తెలిస్తేనే తినాలి. పాలకు బదులుగా బాదం పాలు, సోయాపాల వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చు.