
- పెద్ద వాన పడితే అండర్ పాస్ లోకి నీరు
- హైవే44 మీద మీద కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్జామ్
మెదక్/ మనోహరాబాద్, వెలుగు: దేశంలోనే అతి పొడవైన నేషనల్ హైవే 44పై రాత్రీపగలూ వేల సంఖ్యలో వెహికల్స్తిరుగుతుంటాయి. అలాంటి ఈ హైవే మీద నిర్మిస్తున్న హైలెవల్బ్రిడ్జి పనులు మొదలుపెట్టి ఐదేండ్లయినా ఇంకా పూర్తి కాలేదు. దీంతో పెద్ద వర్షం పడినప్పుడల్లా వందల సంఖ్యలో వెహికల్స్ ఆగిపోయి.. ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ వానాకాలం లోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందనుకున్నా కాలేదు. ఫలితంగా మళ్లీ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు.
స్టీల్ బ్రిడ్జి పనులు లేట్
మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్రైల్వే లైను వేశారు. ఈ రైల్వే ట్రాక్ మనోహారాబాద్ మండలం రామాయిపల్లి వద్ద నేషనల్ హైవే44ను క్రాస్ చేస్తోంది. ఇక్కడ రూ. 109 కోట్లతో హైలెవల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 2018 ఆగస్టు 29న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ట్రాక్ కు రెండు వైపులా చాలాదూరం నుంచి పిల్లర్స్వేసి హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. రైల్వే ట్రాక్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. స్టీల్బ్రిడ్జి కంప్లీట్ కావడానికి మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు.
కిలోమీటర్ల పొడువునా ట్రాఫిక్జామ్
బ్రిడ్జి నిర్మాణం వల్ల హైవే మీద రాకపోకలకు ఆటంకం లేకుండా ఉండేందుకు రోడ్డుకు ఇరువైపులా అండర్ పాస్ నిర్మించారు. సరైన ప్లానింగ్ లేకపోవడంతో భారీ వర్షం పడిన ప్రతిసారి చుట్టుపక్కల నుంచి వరద నీరంతా వచ్చి అండర్ పాస్ లో చేరుతోంది. భారీగా నీరు చేరుతుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. చాలా సందర్భాల్లో కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్జామ్అయ్యింది. గత వర్షాకాలంలో అండర్ పాస్లో ఓ కారు పూర్తిగా మునిగిపోయింది. దాదాపు 24 గంటలు రాకపోకలు స్తంభించాయి. ట్రాఫిక్ జామయిన ప్రతిసారి ఇతర మార్గాల్లో వాహనాలను మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వానాకాలంలోనూ ఈ సమస్య తప్పేలాలేదు.
వాన పడిందంటే ఇబ్బందే
మోస్తారు వాన పడ్డా రామాయిపల్లి అండర్ పాస్లో నీరు నిండి వెహికల్స్ వెళ్లేందుకు ఇబ్బంది అవుతోంది. నాలుగేండ్ల నుంచి ప్రతి వానాకాలంలో ఇదే సమస్య ఎదురవుతోంది. ఈ సారి బ్రిడ్జి పూర్తవుతుందనుకున్నాం. కానీ ఈ వానాకాంలోనూ కష్టాలు తప్పేలాలేవు. ఉన్నతాధికారులు స్పందించి భారీ వర్షాలు పడక ముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించాలి.
వెంకట్ రెడ్డి,మనోహారాబాద్