
జగిత్యాల, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 56 వేల కొలువులు ఇచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. కాంగ్రెస్ను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చాకే డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులను, నిరుద్యోగులను నానా ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. దేశంలోనే ఫస్ట్ టైం యంగ్ ఇండియా యూనివర్సిటీని స్థాపించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు.
ధర్మపురిలో వృత్తి నైపుణ్య కోర్సులతో కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేశామని, బీఆర్ఎస్ చేసిన అప్పులను కడుతూనే, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్రెడ్డిని గెలిపించి గ్రాడ్యుయేట్లు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రాడ్యుయేట్లకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.