Krishna Ashtami 2024:తెలుగు రాష్ట్రాల్లో స్వయంభువుగా వెలసిన శ్రీకృష్ణుడు ఆలయం ఎక్కడుందో తెలుసా...

Krishna Ashtami  2024:తెలుగు రాష్ట్రాల్లో స్వయంభువుగా వెలసిన శ్రీకృష్ణుడు ఆలయం ఎక్కడుందో తెలుసా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక కృష్ణాలయం, పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం, నెమలి... నిత్యం భక్తుల రాకతో పులకించే గ్రామం, సందర్శకులతో సందడిగా ఉండే ప్రదేశం, భక్తుల విరాళాలతో దినదినాభివృద్ది చెందుతున్న దేవస్థానం, లక్షలాది మంది భక్తులు ఇలవేల్పుగా కొలిచే కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని  నెమలి  గ్రామంలో  స్వయంభువుగా వెలిసిన కృ శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయ విశేషాలను  ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుసుకుందాం... 

ఆంధ్రప్రదేశ్​  గంపలగూడెం మండలం నెమలి  గ్రామంలో స్వయంభువుగా వెలసిన వేణుగోపాలస్వామిని కొలిచే భక్తులు నవ్యాంద్రప్రదేశ్ ,తెలంగాణా రాష్ట్రాలలో లక్షలాది మంది ఉన్నారు. తాము కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా స్వామివారిని ఆరాదించే భక్తజనం నెమలి వేణుగోపాలస్వామి.  ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అద్భుతంగా జరుగుతాయి.    ప్రతి నెలా పూర్ణిమ నాడు మాస కళ్యాణం, గోశాలలో నిత్యం గోపూజలు జరుగుతూ ఉంటాయి. వైఖాసన ఆగమనం పద్దతిలో స్వామివారు పూజలందుకునే ఈ ఆలయంలో భక్తుల అన్నప్రాసనలు, వాహన పూజలు, వివాహాలు తదితర శుభకార్యాలు స్వామివారి సన్నిధిలో అధికంగా నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, ముక్కోటి, ధనుర్మాసోత్సవం, ఉగాది, శ్రీరామనవమి విశేషంగా నిర్వహిస్తారు.

ఆలయంలో ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  శుక్రవారం ఇక్కడ దీర్ఘకాలికంగా సమస్యలతో బాధ పడేవారు పోర్లుడు దండాలు పెడతారు.  ప్రతి శుక్రవారం నెమలి వేణుగోపాల స్వామి వారు భక్తులను ఆవహిస్తారని.. భక్తుల కోర్కెలు తీరేందుకు మార్గాలను సూచిస్తారని భక్తులు నమ్ముతారు.  అలానే ఇక్కడ స్వామివారు చెప్పిన మార్గాన్ని అనుసరించిన వారికి  కోరిన కోర్కెలు తీరాయని స్థానికులు చెబుతుంటారు. వివాహమయిన ఎంత కాలానికి కూడా సంతానం కలుగకపోతే ఇక్కడ స్వామిని దర్శిస్తారు.  అలానే వివాహం కావడానికి కూడా నెమలి స్వామిని దర్శిస్తారు.

మానసిక ప్రశాంతత లేనివారు, అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు, సంతానలేమితో బాధపడేవారు స్వామిని దర్శించి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు.సోమవారం, శుక్రవారంల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తుల భూరి విరాళాలుతో ఆలయ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారిని దర్శిస్తే ఈతి బాధలు.. సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల విశ్వాసం.  భక్తులు కూడా అలానే ఇక్కడకు నిత్యం వచ్చి దర్శించుకుంటారు.  తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది నెమలి వేణుగోపాలస్వామి తమ ఇంటి ఇలవేల్పుగా పూజిస్తారు.  

స్వయంభువుగా స్వామివారు ఎలా వెలిశారు :..

1953 మార్చి 23 న (శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభుగా వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు.

 అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయినది. ఆరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి (23-3-1953) ఆవిషయం తెలిసిన షావుకారు నవమి వేడుకల నిర్వహణలో ఉన్న అతను ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించి హుటాహుటిన తన అనుచరులతో కలిసి విగ్రహం లభ్యమైన దివ్యస్తలానికి చేరుకున్నాడు. ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తి అని గ్రహించారు.

కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గునపము వలన శ్రీస్వామివారి వేణువుకు కుడి, ఎడమలవైపుల తగిలి చిటికిన వ్రేలు భిన్నమయింది. గ్రామ పెద్దలు పక్క గ్రామమైన  పెనుగొలను చెందిన అర్చకుడు నందలి క్రిష్ణమచార్యులుని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహం చూపించగా మూడు అడుగుల ఎత్తు, ఉత్తరాభి ముఖముగా వ్యత్యస్థ పదముల నడుము, శిరస్సులు చక్కని ఓంపులతో మురళిని మ్రోగించుచూ, త్రిభంగిమతో దివ్య సుందరమైన చక్రములతో పాదముల కడ ఇరువైపులా విన్ద్యమారాలు వీచు గోపికా స్త్రీలు గోవులతో కూడి అలరారుచు ఉన్న ఆ ఏక శిల విగ్రహమును చూసి శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహంగా గ్రహించారు.

స్వామివారు భూగర్భమునుండి సాక్షాత్కరించిన తీరుకు గ్రామ ప్రజలు భక్తీ పారవశ్యంతో ఆశ్చర్యపోయారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని ప్రతిష్ఠిందలచి ఉరేగించ బయలుదేరగా స్వామివారు ఓ భక్తునికి ఆవహించి “నేను దర్శనమిచ్చిన చోటనే తనను ప్రతిష్టించాలని ఆదేశించారు” . స్వామి ఆదేశమును వెంటనే అమలుచేయదలచాగా ఉత్తరాభి ముఖమున వెలసిన స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచడంతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడింది. వేసిన పందిళ్ళు చిన్నభిన్నమయ్యాయి. పొరపాటును గ్రహించిన వారు స్వామివారిని యధావిధిగా ఉత్తరాభి ముఖముచేయగా కొద్ది క్షణములలొనే తుఫాను శాంతించింది. వెంటనేక్రిష్ణమచార్యులు పురోహితులతో సమక్షంలో పూజలు నిర్వహించారు.అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా వేణుగోపాలస్వామి నిలిసారు. 

1957 ఫిబ్రవరి 6న శాస్రోక్తంగా నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టించారు.  నిత్య పూజా కైంకర్యాలను పెనుగొలను క్రిష్ణమచార్యులకే అప్పగించారు.  ఇప్పటికి కూడా వారి వంశానికి చెందిన వారే అర్చక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి .. క్రిష్ణమచార్యులు గారి మనుమడైన గోపి ప్రధాన అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నారు

శ్రీ కృష్ణుడికి ... నెమలికి విడదీయరాని సంబంధముంది. నెమలి పింఛం ధరించడమంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. చేతిలో వెన్న ముద్దలేని బాల కృష్ణుడు కనిపిస్తాడేమో గానీ, తలపై నెమలి పింఛంలేని కృష్ణుడు మాత్రం కనిపించడు. ఈ సృష్టిలో సంయోగం చేత సంతానాన్ని పొందని పక్షి నెమలి మాత్రమే. ఈ పవిత్రతే శ్రీ కృష్ణుడు నెమలి పింఛం ధరించడానికి కారణమైందని చెబుతుంటారు. అలాంటిది నెమలి అనే ఊళ్లో శ్రీ కృష్ణుడు ఆవిర్భవించడమనేది సహజంగానే విశిష్టతను సంతరించుకున్నదిగా అనిపిస్తుంది..
.
నెమలి పుణ్యక్షేత్రాని ఎలా చేరుకోవాలంటే.....

నెమలి పుణ్యక్షేత్రానికి తెలంగాణా రాష్ట్రంలోని మధిర నుంచి నెమలి గ్రామానికి చేరుకోవాలి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు రైలు లేదా బస్సు మార్గాన మధిర చేరుకొని అక్కడినుంచి నెమలి పోవు బస్సు ఎక్కాలి. సాధారణ రోజుల్లో కుడా తిరువూరు, మధిర డిపోల నుంచి నుంచి నెమలికి బస్సులు తిరుగుతాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత బోర్డర్​ విలేజ్​ కావడంతో రెండు రాష్ట్రాల వారు బస్సులను సరిగా నడపకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.