
కామారెడ్డి, వెలుగు : బిడ్డ పెండ్లి జరుగుతున్న ఆనందంలో ఉండగానే ఓ తండ్రి గుండె ఆగిపోయింది. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన వెంటనే గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో శుక్రవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్చంద్రం (54) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. ఇతనికి కనక మహాలక్ష్మి, కళ్యాణలక్ష్మి ఇద్దరు కూతుళ్లు. కనక మహాలక్ష్మికి పెండ్లి కుదరడంతో భిక్కనూరు మండలం బీటీఎస్ సమీపంలోని ఓ ఫామ్హౌజ్లో శుక్రవారం పెండ్లి తంతు మొదలు పెట్టారు.
ఈ క్రమం బాల్చంద్రం కూతురు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అనంతరం అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన బంధువులు వెంటనే కామారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు బాల్చంద్రం గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో అప్పటివరకు సందడిగా ఉన్న పెండ్లి మండలంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేస్తుండగా నిప్పంటుకొని తల్లి మృతి
ముస్తాబాద్, వెలుగు : బిడ్డ పెండ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చిన్ని బాల్రెడ్డి అంజవ్వ (53) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మార్చి 2న పెద్ద కూతురు పెండ్లి ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం ఇంటి ముందున్న చెత్తను ఒక చోటకు చేర్పిన అంజవ్వ ఆ చెత్తకు నిప్పు పెట్టింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పు అంటుకోవడంతో అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.