
- దామోదర్కు బెర్త్ ఖాయం
- లేదంటే సభాపతిగా చాన్స్
- బీసీ కోటాలో పొన్నం ప్రయత్నాలు
సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు : గురువారం కొలువుదీరుతున్న కాంగ్రెస్ కేబినెట్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కనుందన్న ఆసక్తి నెలకొంది. సంగారెడ్డి జిల్లా అందోల్ నుంచి ఎన్నికయిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బెర్త్ దాదాపు ఖాయమని చెప్తున్నా.. ఆయనను శాసనసభ స్పీకర్గా నియ మించే అవకాశం కూడా లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎన్నికయిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనర్సింహకు బెర్త్ ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
తెలంగాణలో ఏర్పడనున్న తొలి కాంగ్రెస్ మంత్రివర్గంలో ఆయనకు కీలకమైన పోర్ట్పోలియో దక్కుతుందని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ని 10 సెగ్మెంట్లలో ఏడు చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. అందోల్, నారాయణఖేడ్, మెదక్లలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మెదక్, నారాయణఖేడ్ నుంచి మైనంపల్లి రోహిత్, పట్లోళ్ల సంజీవరెడ్డి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో దామోదర్కు రూట్ క్లియర్ అయ్యింది. సమీకరణాల్లో భాగంగా దామోదర్ రాజనర్సింహకు కేబినెట్లో చోటు ఇవ్వలేని పరిస్థితి వస్తే ఆయనకు స్పీకర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన స్పీకర్ పదవి తీసుకునేందుకు సుముఖంగా లేరని ఆయన వర్గీయులు అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం
జిల్లాలో సీనియర్ లీడర్ అయిన దామోదర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినేట్లో మంత్రిగా ఉన్నారు. కిరణ్ కుమార్రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. దామోదర్ రాజనర్సింహ మొదటిసారి 1989లో అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి.. 2006లో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మూడోసారి 2009లో గెలిచిన ఆయన రోశయ్య మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2010 కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా పని చేశారు.
పొన్నం కూడా రేసులో..
సిద్దిపేట జిల్లాలో ఉన్నా కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో విస్తరించిన హుస్నాబాద్ నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్ కూడా రేసులో ఉన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ఆయన ఒక్కరే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. సిద్దిపేట జిల్లా నుంచే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్, హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నందున జిల్లాలో పార్టీ కేడర్కు భరోసా ఇచ్చేందుకు పొన్నం ను కేబినెట్లోకి తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.
ఆయన బీసీ కోటాలో పదవి ఖాయమన్న ధీమాలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ క్రియశీలంగా పని చేసి.. పార్టీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు. ఢిల్లీ పెద్దల ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన ఎల్ బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.