కన్నెపల్లి పంప్హౌస్ పునరుద్ధరణ కోసం రూ.వెయ్యి కోట్ల దాకా ఖర్చు చేశారు. ఖరాబైన 17 మోటార్లలో 11 మోటార్లను రిపేర్ చేసి అమర్చినట్లు ఇంజినీర్లు ప్రకటించారు. ప్రొటెక్షన్ వాల్ మీదపడి పనికిరాకుండా పోయిన 6 మోటర్ల కోసం కొత్తగా ఆర్డర్ ఇచ్చామని, ఆస్ట్రియా నుంచి రాగానే బిగిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.400 కోట్ల వరకు వెచ్చించారు. కొత్త మోటార్ల కొనుగోలుతోపాటు రిపేర్ ఖర్చులన్నింటినీ మేఘా కంపెనీయే భరిస్తుందని అప్పటి రాష్ట్ర సర్కారు ప్రకటించింది.
కానీ, ఇది నాన్ ఈపీసీ వర్క్ కావడం, పంప్హౌస్ ప్రారంభించి అప్పటికే రెండేండ్లు గడిచిపోవడంతో కాంట్రాక్ట్ సంస్థకు బదులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చంతా భరించిందని, ఈ విషయంలో అప్పటి సర్కారు పెద్దలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని కొందరు ఇంజినీర్లు లీకులిచ్చారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఇప్పటికీ ఎవరూ చెప్పలేదు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఉత్తమ్ కన్నెపల్లి పంప్హౌస్ రిపేర్లకు సంబంధించిన బిల్లులు సెక్రెటేరియట్లో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామంటూ బాంబు పేల్చారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు.