మిస్టరీ.. ముందుగా ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు.?

మిస్టరీ..  ముందుగా ఎవరెస్ట్  ఎక్కింది ఎవరు.?

అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఎవరెస్ట్ ఎక్కడం అంటే  సాహసమనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్​ని 1953లో తొలిసారి ఇద్దరు పర్వతారోహకులు ఎక్కినట్టు రికార్డులు చెప్తున్నాయి. 

కానీ.. అంతకుముందే మరో ఇద్దరు ఎవరెస్ట్​ని ఎక్కారని కొందరు వాదిస్తున్నారు. ఎవరెస్ట్​ అంటేనే ఒక మిస్టరీ. కానీ.. దాన్ని ముందుగా ఎక్కిందవరనేది కూడా మిస్టరీనే ఇప్పటికీ. 

మేఘాలు ఎవరెస్ట్​ పర్వతాన్ని కప్పినట్టే.. దాని అధిరోహణ చరిత్రను కూడా కప్పి ఉంచి అంతు చిక్కకుండా చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం 1953 మే 29న న్యూజిలాండ్‌‌కు చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌‌కు చెందిన షెర్పా టెంజింగ్ నార్గే ఎవరెస్ట్​ ఎక్కారు.  

మానవులు సాధించిన విజయాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా దీని గురించి చెప్తుంటారు. ఈ చారిత్రాత్మక ఆరోహణకు ముందు ఎవరెస్ట్ చివరి భాగాన్ని చేరుకోవడానికి అనేక మంది ప్రయత్నించారు. ముఖ్యంగా 1920ల ప్రారంభంలో ఎక్కువగా బ్రిటిషర్లు ట్రై చేశారు.

 హిల్లరీ, టెంజింగ్ నార్గే కంటే మూడు దశాబ్దాల ముందే బ్రిటన్​కి చెందిన జార్జ్ మల్లోరీ, ఆండ్రూ ఇర్విన్‌‌ ఎవరెస్ట్​ ఎక్కినట్టు కొందరు వాదిస్తున్నారు. వీళ్లు 1924లో ఎవరెస్ట్​ ఎక్కేందుకు వెళ్లారు. అదృశ్యం అయ్యారు. 

ఎప్పుడు చనిపోయారు?

అత్యంత కఠినమైన వాతావరణం ఉండే ఉత్తర ధృవం, దక్షిణ ధృవాలకి 1920ల నాటికి మనుషులు వెళ్లారు. కానీ.. ప్రపంచ ‘‘మూడో ధృవం’’గా పేరున్న హిమాలయాల్లోని ఎవరెస్ట్​ని మాత్రం  ఎక్కలేకపోయారు. 

అందుకే ఎలాగైనా ఎవరెస్ట్​ని అధిరోహించాలనే ఉద్దేశంతో జార్జ్ మల్లోరీ, ఆండ్రూ ఇర్విన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ.. ఎవరెస్ట్​ ఎక్కుతూ మధ్యలోనే చనిపోయారు. కానీ.. కొందరు మాత్రం ఎవరెస్ట్​ ఎక్కి, దిగుతుంటే చనిపోయారని చెప్తున్నారు. ఇంతకీ వాళ్ల ప్రయాణం ఎలా సాగింది? అనేది తెలుసుకోవడానికి అంతగా ఆధారాలు లేకపోయినా దొరికిన కొన్ని ఆధారాలతో ఒక అంచనాకి వచ్చారు ఎక్స్​పర్ట్స్​. 

ఈ ఇద్దరూ 1924లో ఆర్టిఫిషియల్​ ఆక్సిజన్​తో ఎవరెస్ట్ ఎక్కేందుకు బయల్దేరారు. వాళ్లలో మల్లోరీ అప్పటికే రెండుసార్లు ఎవరెస్ట్​ ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ.. 24,600 అడుగుల ఎత్తు దాటి పైకి వెళ్లలేకపోయాడు. 

పైగా అతను బ్రిటన్‌‌లోని బెస్ట్​ క్లైంబర్స్​(అధిరోహకుడు)లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇక ఇర్విన్​ విషయానికి వస్తే.. వయసు చాలా చిన్నది. 22 ఏండ్లు ఉంటాయి. పర్వతాలు ఎక్కడంలో అంతగా అనుభవం కూడా లేదు. 

కానీ.. అతను ఆక్సిజన్ సిలిండర్స్​ ఎక్స్​పర్ట్​. ఒక పర్వతారోహకుడి మీద ఆక్సిజన్​ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఆక్సిజన్​ తగ్గిన తర్వాత ఏం చేయాలి?  ఇలాంటివన్నీ ఇర్విన్​కు బాగా తెలుసు. అప్పటివరకు అంత ఎత్తులో ఉన్నప్పుడు మానవ శరీరం ఎలా స్పందిస్తుంది? ఎలాంటి ఎఫెక్ట్​ పడుతుంది? ఆర్టిఫిషియల్​ ఆక్సిజన్ అవసరం ఎంతవరకు ఉంటుందనే వివరాలు కచ్చితంగా ఎవరికీ తెలియవు. కాబట్టి.. ఒక్కడే ఎవరెస్ట్​ ఎక్కడం అంత ఈజీ కాదని మల్లోరీకి అర్థమై వెంట ఇర్విన్​ని తీసుకెళ్లాడు. అతను ఆక్సిజన్ సిలిండర్ల ఫిక్సింగ్, అసెంబ్లింగ్ చేయడంలో ఎక్స్​పర్ట్​. 

చేరుకున్నారా? 

ఎవరెస్ట్​​ ఎక్కిన మల్మోరీ, ఇర్విన్లు మళ్లీ తిరిగి రాలేదు. అయితే.. వాళ్లు ఎక్కుతుంటే చనిపోయారా? లేదంటే.. దిగుతుంటే చనిపోయారా? అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఈ సంఘటన జరిగిన చాలా ఏండ్లకు 1999లో క్లైంబర్​ కాన్రాడ్ అంకెర్ దాదాపు 27,250 అడుగుల (8,229 మీ) ఎత్తులో మల్లోరీ శవాన్ని చూశాడు. 

ఎవరెస్ట్​ ఎత్తు 29,032 అడుగులు (8,849 మీ). అంటే ఇంకా మిగిలింది 2 వేల అడుగులే. ఇర్విన్ శవం ఇప్పటికీ దొరకలేదు. పైగా.. వాళ్లు తమ వెంట తీసుకెళ్లిన కెమెరా కూడా దొరకలేదు. ఆ కెమెరా దొరికితే కనుక వాళ్లు ఎవరెస్ట్​ అగ్రస్థానానికి చేరుకున్నారో, లేదో తెలిసేది. 

ఎలా చనిపోయారు? 

మల్లోరీ యాత్ర మీద రీసెర్చ్​ చేసిన జియాలజిస్ట్​ ఒడెల్లె మాత్రం వాళ్లు ఎవరెస్ట్​ చివరి భాగానికి చేరుకుని ఉంటారని అంచనా వేశాడు. అయితే.. వాళ్లు ఎవరెస్ట్​ ప్రయాణం మొదలుపెట్టిన కొన్ని రోజులకే అక్కడి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ఎవరెస్ట్​ మీద  మంచు తుపాన్లు వచ్చి ఉంటాయి. చాలా వేగంగా చల్లటి గాలులు వీయడంతో ఆ ఇద్దరూ చనిపోయారని ఒడెల్లె పుస్తకంలో రాశాడు.