
హుస్నాబాద్, వెలుగు : తెలంగాణలో ఏ ఊరికి వెళ్లినా ఆ ఊరుకు కాళేశ్వరం నీళ్లే వస్తున్నాయని చెప్పుకునే కేసీఆర్ కుటుంబం ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టులోకి నీళ్లు ఎట్ల వస్తాయో చెప్పాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడంతో నీళ్లన్నీ ఖాళీ చేశారని, మరి హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో అర్థంకావడంలేదన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుందని, భారీ ఎత్తున అవినీతి జరగడంతోనే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కుంగిపోయిందన్నారు.
ఈ అవినీతి బాగోతాన్ని స్వయంగా చూపించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలను బుధవారం మేడిగడ్డ ప్రాంతానికి తీసుకెళ్తుండగా 12 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లతో గౌరవెల్లి ప్రాజెక్టును నింపామని గొప్పలు చెప్పుకున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేధావులు, ఇంజినీర్ల సలహాలు కాదని, తానే అద్భుతమైన ఇంజినీర్ అని చెప్పుకున్న కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిలో మొదటి దోషి అని ఆరోపించారు.
రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా కేంద్రం మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇన్నేండ్లైనా చెక్కుచెదరకుండా ఉక్కులెక్క ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి కాంగ్రెస్ను ఆదరించాలని కోరారు.
ALS0 READ: అక్టోబర్ 28న శ్రీవారి ఆలయం మూసివేత