ఎవుసం చేసెటోళ్లు తగ్గుతున్నరు .. నాబార్డు 2021–22 రిపోర్టు

ఎవుసం చేసెటోళ్లు తగ్గుతున్నరు .. నాబార్డు 2021–22 రిపోర్టు
  • పల్లెల్లో వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలు 55 శాతమే
  • మిగిలిన 45 శాతం ఫ్యామిలీలు ఇతర పనుల్లో..!
  • పెరిగిన లాగోడి ఖర్చులు.. మిగులుబాటు నామ్కే వాస్తే
  • వ్యవసాయ కుటుంబాల నెలవారీ సగటు 
  • ఆదాయం రూ.13,874.. ఖర్చు 13,093
  • ప్రతి నెలా మిగులుతున్నది రూ.781 మాత్రమే
  • గత్యంతరం లేక పొట్టకూటి కోసం ఇతర పనులకు 

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: ఒకప్పుడు పల్లె అంటే ఎవుసం. గ్రామీణ ప్రాంతాల్లోని జనం మొత్తం వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులపై ఆధారపడి జీవించేవాళ్లు. కానీ కాలక్రమేణా పల్లెల్లో వ్యవసాయంపై ఆధారపడేవాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. తాజాగా నాబార్డ్  రిలీజ్ చేసిన ‘సెకండ్ ఆలిండియా రూర‌‌ల్ ఫైనాన్షియ‌‌ల్ ఇంక్లూజ‌‌న్ స‌‌ర్వే 2021-–22’లో ఇదే తేలింది. తెలంగాణ పల్లెల్లో 55% మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి బతుకుతుండగా.. మిగిలిన 45% కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేస్తున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు సగటున కేవలం 2 ఎకరాల భూమి ఉందని, ఈ తరహా చిన్నకమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాక చాలా మంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కున్నట్లు సర్వే తేల్చింది.
 
భూమి కౌలుకు ఇచ్చి వేరే పనులకు..

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 2,330 కుటుంబాల‌‌ను నాబార్డ్​ సర్వే చేసింది.దీని ప్రకారం.. వ్యవసాయ ఆదాయం తగ్గిపోవడంతో గ్రామీణులు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలు, అందుబాటులో ఉన్న భూమిని పరిగణనలోకి తీసుకుంటే సగటున ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల భూమి మాత్రమే ఉంది. చిన్నకమతాల వల్ల రైతుకుటుంబాలకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవసాయ కుటుంబ నెలవారీ సగటు ఆదాయం రూ.13,874 కాగా.. నెలవారీ ఖర్చు 13,093గా ఉంది. అంటే ప్రతి నెలా రూ.781 మాత్రమే మిగులుతున్నది.

గతంలో ఇది రూ.998గా ఉండేది. వ్యవసాయ కుటుంబ ఆదాయం త‌‌‌‌‌‌‌‌క్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 8వ స్థానం. అత్యధికంగా పంజాబ్‌‌‌‌‌‌‌‌లో ఒక్కో రైతు కుటుంబానికి రూ.31,433 ఆదాయం వస్తుండగా.. అక్కడ నెలకు రూ.5,683 మిగులుతున్నట్లు నాబార్డు సర్వేలో వెల్లడైంది. గతంలో రైతుకుటుంబాలు తమకున్న భూమిలో పండే పంటలపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తే.. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి లాంటి కులవృత్తులవాళ్లు పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాళ్లు. యాంత్రికీకరణ కారణంగా కులవృత్తులు దెబ్బతినడంతో వాళ్లంతా ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. వ్యవసాయ కూలీలది కూడా ఇదే పరిస్థితి.

ఈ క్రమంలో కొత్తతరంలో చాలా మంది వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. కొందరు ఆయా గ్రామాల్లో, ఇంకొందరు సమీప పట్టణాల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చూసుకుంటున్నారు. స్వయం ఉపాధితో పాటు సర్వీస్​రంగంలోనూ ఎక్కువ మంది కొలువులు వెతుక్కుంటున్నారు. ఇక చిత్రమైన పరిస్థితి ఏమిటంటే వ్యవసాయంలో తగినంత ఆదాయం లేక తమ భూములను ఇతరులకు కౌలుకు ఇచ్చి,కుటుంబపోషణ కోసం రైతు కుటుంబాలు ఉద్యోగాలు చేసుకుంటున్నాయని నాబార్డు రిపోర్ట్​ స్పష్టం చేసింది. 

సగటు అప్పుల్లోనూ మ‌‌న‌‌మే టాప్‌‌

దేశంలో ఒక్కో కుటుంబంపై సగటున  రూ.90,372 అప్పు ఉంటే.. రాష్ట్రంలో మాత్రం రూ.1,29,599 అప్పు ఉంది. ఇందులో వ్యవసాయ కుటుంబాలే  అధికంగా ఉన్నాయని నాబార్డ్​ తన రిపోర్ట్​లో పేర్కొంది. 2016లో రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% ఉంటే.. 2021–22 నాటికి అది 92%కి పెరిగింది. ఇది రాష్ట్రంలోని భూముల హోల్డింగ్​పై  ప్రభావం చూపుతున్నది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో భూముల హోల్డింగ్ ​క్రమంగా తగ్గుతున్నది.  గతంలో వ్యవసాయ కుటుంబాలకు  ఇంటి జాగాతో పాటు సగటున రెండున్నర ఎకరాల భూమి ఉంటే అది రెండు ఎకరాలకు తగ్గింది. అదే దేశవ్యాప్తంగా  సగటు భూమి హోల్డింగ్ 2016–-17లో 1.08 హెక్టార్ల నుంచి 2021–-22లో 0.74 హెక్టార్లకు తగ్గింది.

ఆదాయంతో పాటే పెరిగిన ఖర్చులు 

కొన్నేండ్లుగా పంటల మద్దతు ధరలు పెరుగుతు న్నందున రైతుల ఆదాయం పెరుగుతున్నదని, కానీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతు న్నాయని నాబార్డు తన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో విశ్లేషించింది. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, పెట్టుబడు ల కోసం చేస్తున్న అప్పులు, వాటి వడ్డీలతో రైతుల పై భారం పడుతున్నది. అదీగాక ఒకప్పుడు రైతు లు తమకు కావాల్సిన అన్నిరకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనెగింజలు తమ పొలంలో పండించుకునేవాళ్లు. అయితే.. ప్రస్తుతం అవన్నీ బయట నుంచి ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీనికితోడు పెరిగిన విని యోగ సంస్కృతి పల్లెను తాకింది. ఖర్చులు విపరీ తంగా పెరిగిపోయాయి. మారిన వాతావరణ పరిస్థి తులు, పెరిగిన గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు వెరసి రోగాలు, వైద్య ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫలితంగా ఆదాయం పెరిగినా ఖర్చులు తీసేస్తే మిగులు అంతంత మాత్రమేనని నాబార్డు తేల్చింది. రాష్ట్రంలో ఒక రైతు కుటుంబానికి సగటున రూ.781 మాత్రమే మిగు లుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.