పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై బీజేపీలో తొలిసారి వ్యతిరేక గళం వినిపించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు) సోమవారం నాడు ఆ పార్టీ లైన్కు బిన్నంగా మాట్లాడారు. పౌరసత్వానికి మతానికి లింక్ పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. భారత్ ఎప్పుడూ అన్ని మతాలను, కులాలను సమానంగా చేస్తుందన్నారు.
భారత పౌరసత్వం పొందడానికి మతంతో సంబంధం లేదని పౌరసత్వ చట్టం కూడా చెబుతోందని బోస్ అన్నారు. కానీ, హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతాలకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని CAA-2019లో ఎందుకు పేర్కొన్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బోస్. CAAలో ముస్లింలను కూడా కలపాలని కోరారు. ఒకవేళ వాళ్ల స్వదేశాల్లో ముస్లింలపై హింస జరగకుంటే భారత్కు రారని అన్నారు.
బలూచీ, అహ్మదీయా ముస్లింల సంగతేంటి?
భారత్ను ఇతర దేశాలతో పోల్చి చూడొద్దని, ఇక్కడ అన్ని మతాలు, కులాలు సమానమేనని చెప్పారాయన. బంగ్లాదేశ్, అఫ్ఘాన్, పాకిస్థాన్లలో ముస్లింలు కూడా అణిచివేత, హింసకు గురవుతున్నారని బోస్ చెప్పారు. పాక్, అఫ్ఘాన్లలో బతుకుతున్న బలూచీ, పాక్లోని అహ్మదీయా ముస్లింలు ఘోరమైన బాధలు ఎదుర్కొంటున్నారని, వారి సంగతేంటని ఆయన ప్రశ్నించారు.
పాక్, అప్ఘాన్, బంగ్లాదేశ్లలో మత హింసను ఎదుర్కొంటున్న ఆరు ముస్లిమేతర మతాల వారికి భారత పౌరసత్వం కల్పిస్తామంటూ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టును తెచ్చింది కేంద్రం. 2014 డిసెంబరు 31కి ముందు భారత్కు వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నవాళ్లకు ఈ అవకాశం కల్పించేలా పౌరసత్వ చట్టంలో మార్పు చేసింది భారత ప్రభుత్వం.