ఆధ్యాత్మికం: ఇంట్లో పూజలు.. శాంతులు.. హోమాలు ఎందుకు చేయాలో తెలుసా..

ఆధ్యాత్మికం: ఇంట్లో పూజలు.. శాంతులు.. హోమాలు ఎందుకు చేయాలో తెలుసా..

హిందువులు దాదాపు అందరూ ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తారు.  కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో శాంతులు, హోమాలు కూడా నిర్వహిస్తారు.  వీటిని అందరూ పెద్దలు చెప్పారు కాబట్టి చేస్తున్నాం అంటారు.  కాని వీటిని ఎందుకు చేయాలి.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం శాస్త్రాలు ..  పురాణాలు.. వేదాలు ఏంచెబుతున్నాయో తెలుసుకుందాం. . .

కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయ్యే సందర్భంలో  దైవ పూజలు, శాంతులు, హోమాలు చేస్తారు. మానవుడు అనంతకోటి జీవరాశులలో ఒకడు.  ప్రకృతితో మమేకమై జీవనం సాగించినప్పుడే అతడి మనుగడకు సార్ధకతఉంటుంది. అన్నింట్లో తాను కూడా ఒకడై మిగతా జీవులతో సమానంగా జీవించాలని శాస్త్రం బోధిస్తుంది. పక్షిజాతి ఎలా గూడు కట్టుకుని జీవిస్తుందో, మానవుడు కూడా తన రక్షణకు తనవారి పరిరక్షణ కోసం ఒక ఇల్లు కట్టుకుని బ్రతుకుతాడు. ఇక ఒక ఇల్లు కట్టాలంటే శాస్త్రం కొన్ని నియమాలను చెప్పింది. స్థల సేకరణ దగ్గరనుండి ఇల్లు పూర్తిగా కట్టుకునే వరకు ఎలా వ్యవహరించాలో ప్రత్యేకంగా వాస్తు శాస్త్ర రూపంలో వివరిస్తుంది. 

ALSO READ | ఆధ్యాత్మికం: ప్రతిరోజు దీపారాధన ఎందుకు చేయాలి... వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి..

వాస్తు శాస్త్రంలో ఎంతో విజ్ఞాన నిధి నిమిడీకృతమై వున్నది.  ఏ వైపు ఎత్తుగా వుండాలి, ఏ వైపు కొంచెం వాలు ఉండాలి, ఏ గది ఎక్కడ కట్టుకోవాలో చెబుతుంది వాస్తుశాస్త్రం. మనకున్న ఈశాన్య, నైరుతి ఋతుపవనాల ఆధారంగా ఎక్కడ వంటిల్లు వుండాలి, ఎక్కడ బావులు తవ్వాలి, యెక్కడ పడకిల్లు ఉండాలో దాని వలన వారికి ఎలా ఆరోగ్యం కలుగుతుందో అన్న విషయాన్ని శాస్త్రం చెబుతుంది. శాస్త్ర ప్రధాన ఉద్దేశ్యం ఇంటికి, వంటికి సరైన వెలుతురు, గాలి ప్రసరణ జరగాలి, తద్వారా శారీరక, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలగాలని ఆ శాస్త్ర ప్రధాన ఉద్దేశ్యం. దాన్ని నేడు వక్రీకరించి కొంతమంది శాస్త్ర ప్రాముఖ్యాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నారు, .

ఒక ప్రదేశాన్ని గృహ నిర్మాణానికి ఎంచుకున్న తరువాత ముందుగా పూజ చేసి పనులు ప్రారంభిస్తాము. చదునుచేసుకున్న ప్రదేశంలో శంఖుస్థాపన చేసుకుని అప్పుడు నిర్మాణం చేపడతాము. మనం ఎంచుకున్న ప్రదేశంలో అంతకు ముందు కొన్ని చెట్లు ఉండవచ్చును, వాటిపై నివాసముండే ఎన్ని జీవరాశులు వాటి నెలవు కోల్పోతాయి. ఆ నేలను నమ్ముకుని ఎన్నో జీవాలు ఉంటాయి. మనం చదును చెయ్యడం వలన ఎన్నో జీవరాశులను మనం తెలియక చంపుతున్నాము. ఇదంతా మనకు తెలియక చేస్తున్న పాపం. కానీ మనం ఒక గృహం కట్టుకోవాలంటే తప్పదు. 

అంతేకాదు రోజు మనం ఇల్లు తుడవడం వలన ఎంతో హింస చేస్తున్నాం. దీనికి శాస్త్రం భూత హింస అని అంటుంది. అటువంటి భూతహింస తెలిసో తెలియకో మనం రోజూ చేస్తున్నాము. వాటి ప్రక్షాళనకు మనకు దానం, హోమం ఇతరత్రా చెప్పబడి వున్నాయి. గృహస్థు మిగిలిన ఆశ్రమాల వారిని పోషించాలి. చదువుకునే బ్రహ్మచారులకు, ఆకలితో వచ్చిన అతిధులను, ముసలి వారిని, సన్యాసాశ్రమ వాసులను పోషించవలసిన బాధ్యత గృహస్తాశ్రమానికి ఉన్నది. అటువంటి గృహస్తు ఒక ఇంటిని కట్టుకున్నప్పుడు చెయ్యవలసిన శాంతులు, హోమాలు దైవజ్నులైన పండితులు చెబుతారు. వాటిని ఆచరించడం వలన మనం చేసిన హింస ప్రక్షాళన జరుగుతుంది.

గృహం నిర్మించడానికి మొదలు ఇంటికి ఈశాన్యంలో ఒక శుభ ముహూర్తంలో శుద్ధి చేసి ఎక్కడ నుండి పని ప్రారంభిస్తామో అక్కడ నేలలో కొన్ని అడుగుల గొయ్యిలో నవధాన్యాలు, నవరత్నాలు, శంఖువు స్థాపించి, తాపీ పని అక్కడ మొదలు పెడతాము. ఇంటికి అది ఆయువుపట్టు. ఒకరకంగా చెప్పాలంటే అది ఎనర్జీ సెంటర్. అక్కడ నమక చమకాలతో మంత్రసహితంగా ఎన్నో ఉపచర్యలు చేసి శక్తిని నిలుపుతాము. అక్కడనుండి మిగిలిన పనులు చేసుకుంటూ ఇంటికి గాలి వెలుతురు వచ్చేట్టుగా జాగ్రత్తగా కట్టుకుంటున్నాము. ఆ గృహానికి సీమగా ఆ గృహ ప్రధాన ద్వారాన్ని మంచి ముహూర్తంలో నిలుపుతాము.  గృహ ప్రవేశ సమయంలో మనం చేసిన పని సక్రమంగా జరిపించి సజావుగా పూర్తి చేయించినందుకు దేవతలకు ధన్యవాద పూర్వకంగా హోమ, జప తపాదులు చేసి అందరికీ అన్నశాంతి జరిపించి వారి ఆశీర్వాదాలను అందుకుని ఆ ఇంట అడుగు పెడతాము. 

ఆ ఇంటిలో అన్నీ శుభకార్యాలు జరగాలని భగవంతుని ప్రార్దిస్తాము. negative ఎనర్జీ ని బయటకు తరిమి positive ఎనర్జీ ని ఇంటిలో నిమ్పుకుంటాము. సకల దేవతా స్వరూపంగా కామధేనువు ఇంటి లో నడయాడెట్టు ఒక ఆవును ఇంటిలో ప్రవేశం చేయిస్తాం. ఇంట్లో సుఖ సంతోషాలు పొంగి పొరలాలని పాలు పొంగించి పొంగలి చేసి దేవునికి నివేదన చేస్తాం. మన ధర్మం ప్రకృతిలో అన్నింటిలోను దైవాన్ని దర్శిస్తాము. పొద్దున్న లేచి కాలు కింద పెట్టాలంటే భూమాతకు “సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే .. “ అంటూ మన పాదం ఆవిడ మీద మోపినందుకు క్షమాపణ చెప్పుకుని ఆవిడ మనల్ని రక్షించాలని కోరుకుని రోజు మొదలు పెడతాము. 

మనకు నీరు దైవం, గాలి దైవం, అగ్ని దైవం, అన్నీ దేవతా స్వరూపాలే. మన చుట్టూ మనతో వున్న అధిదేవతలు మనలను నిత్యం కాపాడాలని వారిని ప్రార్ధించుకుంటాము. వారి ప్రీతిగా హోమాలు చేసి వారి స్వాగతించివారిని తృప్తి పరచి మన జీవనం సాగిస్తేశుభప్రధంగాజీవనం సాగించగలమని పురాణాలు చెబుతున్నాయి.