నేరస్తుల ఆస్తుల అటాచ్​మెంట్​లో విస్తృత అధికారాలు

నేరస్తుల ఆస్తుల అటాచ్​మెంట్​లో విస్తృత అధికారాలు

పరారీలో ఉన్న నేరస్తుల ఆస్తులు ఎక్కువగా విదేశాలలో ఉంటున్నాయి. ఆ ఆస్తులన్నీ తిరిగి రాబట్టుకోవడం అనేది చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. అందుకని వాటిని అటాచ్​ చేయడం, వాటిని తిరిగి రాబట్టడమనేది అవసరమై రెండు ప్రధాన చట్టాలలో వాటి రికవరీ కోసం కొన్ని నిబంధనలను ఏర్పాటు చేశారు. ఆ చట్టాలు మనీ లాండరింగ్​ చట్టం 2002,  పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల చట్టం 2018. ఇప్పుడు మరో కొత్తచట్టం వచ్చింది. 

అదే క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​ స్థానంలో వచ్చిన భారతీయ నాగరిక్​ సురక్షా సంహిత 2023. ఈ చట్టం జులై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది జనరల్​గా అన్ని నేరాలకు వర్తిస్తుంది. పీఎంఎల్ఎ, ​ఎఫ్ఈఓఎ చట్టాలు ప్రధానమైన చట్టాలు. భారతీయ న్యాయసంహిత (పాత ఐపీసీ)లోని అన్ని నేరాలకి ఇది వర్తిస్తుంది. బీఎన్ఎస్ఎస్​లో ఓ కొత్త నిబంధనని ఏర్పాటు చేశారు. 

అదే సె.107. ఈ నిబంధన ప్రకారం ఒక నేరాన్ని విచారిస్తున్న పోలీస్​ అధికారికి ఏదైనా ఆస్తిని నేరకారణంగా పొందారని విశ్వసనీయంగా అనిపిస్తే, ఎస్పీ, కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ అనుమతి తీసుకుని సంబంధిత మేజిస్ట్రేట్​ కోర్టులో అటాచ్​మెంట్​ కోసం దరఖాస్తు చేయవచ్చు. 

నేరం ద్వారా వచ్చిన ఆస్తి అని ఆ మేజిస్ట్రేట్​కి విశ్వస నీయంగా అనిపిస్తే అతను ఆ నేరస్తునికి నోటీసు ఇచ్చి  ఆ ఆస్తిని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పమని కోరవచ్చు. ఈ జవాబుని 14 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుం ది. ఈ నోటీసుని సాక్ష్యం తీసుకున్న తరువాతగానీ, సాక్ష్యం తీసుకోవడానికి ముందుగానీ ఇవ్వొచ్చు.

ఒకవేళ  నేరస్తుల ఆస్తి వేరే వ్యక్తి అధీనంలో ఉంటే ఆ వ్యక్తికి కూడా నోటీసును  మేజిస్ట్రేట్​కోర్టు ద్వారా చేయవచ్చు. వారికి నోటీసు ఇచ్చి వారి వివరణను తీసుకుని, వాళ్లకు సహేతుకమైన అవకాశం ఇచ్చి, ఆ ఆస్తులు నేరం ద్వారా వచ్చిన ఆస్తులని కోర్టు భావించినప్పుడు అటాచ్​మెంట్​ ఉత్తర్వులను జారీ చేస్తాయి. 

ఒకవేళ ఆ వ్యక్తులు కోర్టు నోటీసు ఇచ్చిన 14 రోజులలో జవాబు ఇవ్వకపోయినా, కోర్టు ముందు హాజరుకాకపోయినా కోర్టుగానీ,  మేజిస్ట్రేట్​గానీ ఏకపక్షంగా ఉత్తర్వులను జారీచేయవచ్చు. నోటీసు ఇవ్వడం అటాచ్​మెంట్​ ఉద్దేశ్యమే దెబ్బతింటుందని కోర్టుగానీ,  మేజిస్ట్రేట్​గానీ భావించినప్పుడు నోటీసు లేకుండానే మధ్యంతర అటాచ్​మెంట్ ఉత్తర్వులుగానీ, జప్తు ఉత్తర్వులుగానీ కోర్టు జారీ చేయవచ్చు. 

అదేవిధంగా అటాచ్​ చేసిన లేదా స్వాధీనం చేసుకున్న ఆస్తులు నేరం ద్వారా వచ్చిన ఆస్తి  అని కోర్టు గుర్తిస్తే ఆ ఆస్తులను బాధితులకు వారి భాగాల ప్రకారం పంచమని జిల్లా  మేజిస్ట్రేట్​ని కోర్టులు ఆదేశించవచ్చు. కోర్టు నుంచి ఈ ఉత్తర్వులు అందుకున్న 60 రోజుల్లోగా అతను స్వయంగా గానీ లేక తన సబార్డినేట్​ని గాని పంపిణీ చేయమని ఆదేశింవచ్చు. 

ఒకవేళ ఆ ఆస్తి తీసుకోవడానికి క్లైయిమెంట్స్​లేనప్పుడు లేదా వాళ్లని గుర్తించలేనప్పుడు లేదా క్లైయిమ్​లకు మించి నేర ఆదాయం ఉన్నప్పుడు ఆ ఆస్తిని ప్రభుత్వానికి హ్యాండోవర్​ చేయాల్సి ఉంటుంది. 

షరతుల ప్రకారం మాత్రమే ఆస్తి జప్తు

‘నేర ఆస్తి’ అనే విషయాన్ని ఆ రెండు ప్రత్యేక చట్టాలలో ఒకేరకంగా నిర్వచించారు. దేశం వెలుపల ఉన్న ఆస్తిగానీ, దాచి ఉంచిన ఆస్తిగానీ  నేర ఆస్తి నిర్వచనంలోకి వస్తుంది.  ఆ విధంగా బీఎన్ఎస్ఎస్​లో చెప్పలేదు. అటాచ్​మెంట్​ చేయ డానికి ఆ రెండుప్రత్యేక చట్టాలలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. అది బీఎన్ఎస్ఎస్​లో లేదు. కొన్ని షరతుల ప్రకారం మాత్రమే ఆస్తిని జప్తు చేయడానికి అవకాశం ఉంది. 

అవి సంబంధిత ఎస్పీ, కమిషనర్​ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తరువాత మేజిస్ట్రేట్​ దగ్గర దరఖాస్తు చేయాలి. మేజిస్ట్రేట్ ఆ నేరస్తుల దగ్గర నుంచి, ఆ ఆస్తి ఉన్న వ్యక్తులకు నోటీసు ఇచ్చి 14 రోజుల్లో జవాబు కోరాలి. ఆ తరువాత వాళ్లకి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన తరువాత అవసరమని భావిస్తే ఆస్తిని అటాచ్​ చేయమని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. 

ఆ రెండు ప్రత్యేక చట్టాలలో అటాచ్​ చేయడానికి అది ‘నేర ఆస్తి’ అని నమ్మడానికి కారణం ఉండాలి. అది రాతపూర్వకంగా వాళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అది కూడా వారి దగ్గర ఉన్న మెటీరియల్​ ఆధారంగా కారణాలు రాయాల్సి ఉంటుంది. కానీ, బీఎన్ఎస్ఎస్సె.107లో ఆ విధంగా లేదు. పోలీస్​ అధికారి ‘నేర ఆస్తి’ అని నమ్మడానికి అతను ఎలాంటి కారణాలను చూపించాల్సిన అవసరం లేదు. 

ముద్దాయికి పరిమిత హక్కు

ఈ రెండు ప్రత్యేక చట్టాల ప్రకారం అటాచ్​చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఉన్నప్పుడే అటాచ్​ చేయాల్సి ఉంటుంది. కానీ, అలాంటి షరతులు ఏవీ సె.107 బీఎన్ఎస్ఎస్​లో చెప్పలేదు. నోటీసు ఇచ్చిన తరువాత ప్రత్యేక చట్టాలలో వివరణ ఇచ్చుకోవడానికి ఇచ్చిన వ్యవధి 30 రోజులు. సె.107 ప్రకారం ఈ వ్యవధి 15 రోజులు మాత్రమే. 

ఆ వ్యవధిలోఅతను హాజరు కాకపోయినా సరైన వివరణ ఇవ్వకపోయినా కోర్టు ఏకపక్షంగా అటాచ్​మెంట్ ఉత్తర్వులను జారీ చేయవచ్చు. అంతేకాదు కోర్టు ఏకపక్షంగా కూడా ఉత్తర్వులను జారీ చేయవచ్చు. అంటే బీఎన్ఎస్ఎస్​లో ముద్దాయి తన వాదనను వినిపించుకోవడానికి ఉన్న హక్కు పరిమితమైనది. అంతేకాదు 60 రోజుల తరువాత అటాచ్​ చేసిన ఆస్తిని బాధితులకు పంపిణీ చేయవచ్చు. 

ఇది కూడా ప్రత్యేక చట్టానికి మించినది. చార్జెస్​ను నిర్ధారించేటప్పడు ముద్దాయి ఎలాంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందు ఉంచే అవకాశం లేదు. అందుకని తప్పుడు కేసులో ఇరుక్కున్న ముద్దాయి చట్టం చట్రం నుంచి బయటపడటం కష్టం. చివరగా ఈ అధికారాలని వినియోగించేది ఎక్కువగా మేజిస్టేట్​ కోర్టు.  వాళ్లు ఎక్కువగా కొత్తవాళ్లు. అనుభవం తక్కువ ఉన్నవాళ్లు. ఇది ఆలోచించాల్సిన విషయం. ప్రత్యేక చట్టాలని మించిపోయింది సె.107.  ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. 

‘జప్తు’ అంటే ఏమిటనేది.. మూడు చట్టాల్లోనూ నిర్వచించలేదు

మనీలాండరింగ్, పరారీలో ఉన్న వ్యక్తుల చట్టాలకి బీఎన్ఎస్ఎస్​కి మధ్య ఉన్న భేదంను పరిగణనలోకి తీసుకుంటే..మనీలాండరింగ్​ని నిరోధించడానికి, అదేవిధంగా మనీలాండరింగ్​ వల్ల వచ్చిన ఆస్తిని జప్తు చేయడానికి ఆ చట్టంలో ఈ అటాచ్​మెంట్ నిబంధనని ఏర్పరిచారు. అదేవిధంగా 100 కోట్లకు మించి ఆర్థిక నేరాలకు పాల్పడి భారతదేశం వెలుపల ఆస్తులని సంపాదించిన పరారీ నేరస్తుల ఆస్తులని జప్తు చేయడానికి ఆ చట్టంలో అటాచ్​మెంట్​ నిబంధనలను ఏర్పరిచారు. అయితే, బీఎన్​ఎస్​ఎస్​ అనేది ప్రాథమికమైన మౌలిక చట్టం. 

‘జప్తు’ అంటే ఏమిటి అన్న విషయాన్ని ఈ మూడు చట్టాల్లో ఎక్కడా నిర్వచించలేదు. అటాచ్​మెంట్ అంటే ఏమిటో పీఎంఎల్​ఎ (మనీలాండరింగ్) చట్టంలో మాత్రమే నిర్వచించారు. దీని గురించి ఓ ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. 

ఆస్తి అటాచ్​మెంట్​ అనేది ఆ రెండు చట్టాలులోని సె.4, సె.5లలో తెలిపారు. కొత్త బీఎన్​ఎస్ఎస్​ చట్టంలో ఓ కొత్త నిబంధనని ఏర్పాటు చేశారు. అదే సె.107. భారతదేశంలో ఉన్న ఆస్తిని జప్తు చేసే విధానం గురించి ఈ నిబంధన చెబుతున్నది. భారతదేశం వెలుపల ఉన్న నేర ఆస్తి జప్తు గురించి సె.115లో పేర్కొన్నారు.

- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి​ (రిటైర్డ్)