
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. సీఎస్కేతో సమానంగా ఐదు టైటిళ్లు గెలిచిందా టీమ్. రిలయన్స్ వంటి బలమైన యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మేటి టీ20 ఫ్రాంచైజీగా పేరు గడించింది. కానీ, ఆ టీమ్ తన చివరి టైటిల్ నెగ్గి ఐదేండ్లు అవుతోంది. 2020లో ఐదో టైటిల్ అందుకున్న తర్వాత ఎంఐ ఆట దిగజారింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారే ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు రెండుసార్లు చివరి స్థానంలో నిలిచి నిరాశపరిచింది.
పైగా, తమను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మను తప్పించిన ఫ్రాంచైజీ గతేడాది హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించి అందరికీ షాకిచ్చింది. ఈ నిర్ణయం బెడిసికొట్టింది. గుజరాత్ టైటాన్స్ను వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన పాండ్యా నాయకత్వంలో ముంబై 2024లో ఆఖరి స్థానంతో సరిపెట్టింది. దాంతో హార్దిక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
మెగా వేలానికి ముందు రోహిత్, హార్దిక్, సూర్యకుమార్, బుమ్రా, తిలక్ వర్మను రిటైన్ చేసుకొని కోర్ టీమ్ను నిలబెట్టుకున్న ముంబై కొత్తగా 18 మందిని జట్టులోకి తీసుకొని 2025 సీజన్కు సిద్ధమైంది. 18వ ఎడిషన్లో మళ్లీ మునుపటి ఆటను చూపెట్టాలని ఎంఐ భావిస్తోంది. డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ అమ్మాయిలు రెండో టైటిల్ నెగ్గిన నేపథ్యంలో అబ్బాయిలు కూడా అదరగొట్టి ఆరోసారి విజేతగా నిలవాలని కోరుకుంటోంది.
బలాలు
పవర్ఫుల్ బ్యాటింగ్ ఆర్డర్ ఈసారి ముంబై ప్రధాన బలం. గతేడాది ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్ రాకతో టాపార్డర్ మరింత మెరుగైంది. గత సీజన్లో జాక్స్ గుజరాత్పై 41 బాల్స్లో సెంచరీ కొట్టి ఆర్సీబీని ప్లేఆఫ్స్ రేసులో నిలిపాడు. తాను ఓపెనర్గా వచ్చినా.. మూడో నంబర్లో ఆడినా ముంబై బ్యాటింగ్ లైనప్కు అదనపు బలాన్ని ఇస్తాడు. రోహిత్కు తోడు ఓపెనర్గా సౌతాఫ్రికా నయా స్టార్ ర్యాన్ రికెల్టర్ అందుబాటులో ఉన్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న రికెల్టన్ గతేడాది 150 ప్లస్ స్ట్రయిక్ రేట్తో 1000 ప్లస్ రన్స్ చేశాడు.
సూర్యకుమార్, తిలక్ వర్మ, పాండ్యాతో మిడిలార్డర్ కూడా పదునుగా కనిపిస్తోంది. తిలక్ సూపర్ ఫామ్లో ఉండగా.. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జట్టును గెలిపించిన రోహిత్ కూడా టచ్లోకి రావడం ముంబై జట్టుకు శుభసూచకం. తమ పేస్ లీడర్ బుమ్రాకు తోడు 2020లో టైటిల్ నెగ్గిన జట్టులో సభ్యుడైన న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి రావడంతో పవర్ ప్లే, డెత్ ఓవర్లలో ముంబై బౌలింగ్ పదునెక్కనుంది. శాంట్నర్, ముజీబ్ రహ్మాన్ రూపంలో ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు.
బలహీనతలు
పేపర్పై చూస్తే ముంబై బ్యాటింగ్ పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కొన్ని అందోళనలు కూడా ఉన్నాయి. 2024లో 38 టీ20 ఇన్నింగ్స్ల్లో 25.94 సగటుతో 934 రన్స్ మాత్రమే చేసిన సూర్య పేలవ ఫామ్లో ఉన్నాడు. విల్ జాక్స్ను టాపార్డర్లో ఆడించాలంటే తిలక్ వర్మను మిడిలార్డర్కు పంపించాల్సి ఉంటుంది. ఇన్ఫామ్ ప్లేయర్ బ్యాటింగ్ పొజిషన్ను మార్చితే తన లయ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫిట్గా ఉంటే కెప్టెన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడనడంలో సందేహం లేదు. కానీ, తన గాయాల చరిత్ర కాస్త ఆందోళన కలిగిస్తోంది.
బౌలింగ్లోనూ ఫిట్నెస్ సమస్యలు ముంబైని వెంటాడుతున్నాయి. వెన్ను గాయంతో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా ముంబై తొలి ఐదు మ్యాచ్లకు అందుబాటులో ఉండే చాన్స్ కనిపించడం లేదు. తను కోలుకొని తిరిగొచ్చినా.. ఫిట్నెస్, వర్క్లోడ్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ సారి కొత్తగా జట్టులోకి వచ్చిన దీపక్ చహర్ కూడా గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ స్తున్నాడు. శాంట్నర్, ముజీబ్కు తోడు మరో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం ఇబ్బందిగా మారొచ్చు.
అవకాశాలు
గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ను వదులుకొని వచ్చి ముంబై కెప్టెన్సీ అందుకున్న హార్దిక్ పాండ్యా లీగ్ మొత్తం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. రోహిత్ను మోసం చేసి కెప్టెన్ అయ్యాడంటూ ముంబై స్టేడియంలో సొంత అభిమానుల నుంచి సైతం వెక్కిరింపులు ఎదురవడం అతనితో పాటు టీమ్ ఆటను ప్రభావితం చేసింది. అయితే, ఏడాది వ్యవధిలోనే టీమిండియా తరఫున రోహిత్తో కలిసి టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంతో పాండ్యా తిరిగి అభిమానుల మనసు గెలవడం సీజన్కు ముందు సానుకూలాంశం. జట్టుగా చూస్తే ఆరో టైటిల్ నెగ్గేందుకు తగిన బలాలు ముంబైలో ఉన్నాయి.
అయితే గత సీజన్ తప్పిదాలను సరిదిద్దుకోవడంతో పాటు కీలక ప్లేయర్లంతా తమ సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సూర్యకుమార్ తన మార్కు షాట్లతో కదం తొక్కాలి. బుమ్రా ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తే.. కొత్తగా వచ్చిన ఆటగాళ్లు కూడా
రాణిస్తే మళ్లీ పాత ముంబైని చూడొచ్చు.
ముంబై ఇండియన్స్ టీమ్
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, నమన్ ధీర్, విల్ జాక్స్, ముజీర్ ఉర్ రహ్మాన్, మిచెల్ శాంట్నర్, ర్యాన్ రికెల్టన్ (కీపర్), రీస్ టాప్లీ, రాబిన్ మింజ్ (కీపర్), కర్ణ్ శర్మ, విఘ్నేశ్ పుత్తూర్, బెవాన్ జాకబ్స్ (కీపర్), సత్యనారాయణ రాజు, రాజ్ బవా, అశ్వనీ కుమార్, అర్జున్ టెండూల్కర్,కృష్ణన్ శ్రీజిత్.