
పారిస్: టోక్యో ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. పారిస్లోనూ టైటిల్ను నిలబెట్టుకుంటాడా? జావెలిన్ క్వాలిఫికేషన్లో ఒకే ఒక్క త్రోతో 89.34 మీటర్ల దూరం అందుకున్న అతను ఫైనల్లో 90 మీటర్ల మార్క్ క్రాస్ చేస్తాడా? గతంతో పోలిస్తే ఈసారి నీరజ్కు ఎవర్ని నుంచి పోటీ ఎక్కువగా ఉంది? ప్రస్తుతం సగటు అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలివి. ఈ సమాధానాలకు గురువారం జవాబు దొరకనున్న నేపథ్యంలో.. టోక్యో ఒలింపిక్స్తో పోలిస్తే ఈసారి నీరజ్కు మాత్రం కఠిన పరీక్ష ఎదురుకానుంది.
టోక్యోలో ఆరుగురు అటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్ (84 మీటర్లు) అందుకుంటే ఈసారి ఆ సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఐదుగురు ఫస్ట్ త్రోలోనే ఈ మార్క్ను అందుకున్నారు. ఇప్పుడు వీళ్ల నుంచే నీరజ్కు ముప్పు పొంచి ఉంది. క్వాలిఫికేషన్ను కాస్త ఈజీగా తీసుకున్న వీళ్లు ఫైనల్ కోసం మరింత శ్రమిస్తున్నారు. మునుపటితో పోలిస్తే ఈసారి ఫైనల్ భిన్నంగా ఉంటుందని నీరజ్ కూడా వ్యాఖ్యానించాడు. ఒకవేళ ఫైనల్లో నీరజ్ గోల్డ్ నెగ్గితే కొత్త చరిత్ర సృష్టిస్తాడు.
జావెలిన్లో టైటిల్ నిలబెట్టుకున్న ఐదో ఒలింపియన్గా రికార్డులకెక్కుతాడు. ఎరిల్ లెమ్మింగ్ (స్వీడన్–1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్–1920, 1924), జన్ జెలెంజీ (చెక్–1992, 1996, 2000), అండ్రియాస్ తొర్కిల్డ్సెన్ (నార్వే–2004, 2008) సరసన చోటు సంపాదిస్తాడు. ఇక స్వాతంత్ర్యం తర్వాత ఇండియా తరఫున రెండు మెడల్స్ నెగ్గిన నాలుగో ఒలింపియన్గా నిలుస్తాడు. పీవీ సింధు (రజతం, కాంస్యం), సుశీల్ కుమార్ (రజతం, కాంస్యం), మను భాకర్ (రెండు కాంస్యాలు) ముందున్నారు. గేమ్స్కు ముందు గాయంతో ఇబ్బందిపడినా ప్రస్తుతం నీరజ్ ఫామ్కు ఎలాంటి ఢోకా లేదు. కనీసం పర్సనల్ బెస్ట్ (89.94మీ.) నమోదు చేసినా నీరజ్ గోల్డ్ మెడల్ నెగ్గడం పెద్ద కష్టమేం కాబోదు.