
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయినా.. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కారణంగా ఇంటా బయటా.. ఆ జట్టుకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ‘ఈ సాలా కప్ నామ్దే’ (ఈసారి కప్పు మాదే) అంటూ ఆ టీమ్ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. కానీ, 17 సార్లు ప్రయత్నించినా.. మూడుసార్లు ఫైనల్ (2009, 2011, 2016) చేరినా.. ఆర్సీబీ ఐపీఎల్ చాంపియన్ అనిపించుకోలేకపోయింది.
దాంతో ఈసారి ముగ్గురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ మెగా వేలంలో 19 మంది కొత్త ఆటగాళ్లతో తమ టీమ్ను పూర్తిగా మార్చుకుంది. యంగ్స్టర్ రజత్ పటీదార్కు కెప్టెన్సీ అప్పగించింది. గత ఐదు సీజన్లలో నాలుగుసార్లు ప్లేఆఫ్స్కి చేరిన ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇది 18వ సీజన్. కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18. ఈ లెక్కలో అయినా ఆర్సీబీకి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.
బలమైన బ్యాటింగ్ లైనప్
ఐపీఎల్లో ముందు నుంచి ఆర్సీబీ బలం బ్యాటింగే. ఈసారి కూడా పలువురు టాప్ క్లాస్ టీ20 స్టార్లతో ఆ టీమ్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చేరిక ప్రయోజనంగా మారనుంది. గత సీజన్లో కేకేఆర్ తరఫున 12 ఇన్నింగ్స్లలో 435 రన్స్ చేసిన సాల్ట్ అదే జోరు ఆర్సీబీ తరఫునా చూపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోహ్లీ గత సీజన్లో 61.75 సగటుతో 741 రన్స్ చేశాడు.
ఇప్పుడు కోహ్లీ–సాల్ట్ ఓపెనింగ్ అత్యంత ప్రమాదకరమైన జోడీగా మారవచ్చు. మిడిలార్డర్లో కెప్టెన్ రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్ జట్టును నిలబెట్టే బాధ్యత వహించనున్నారు. వీరి తర్వాత లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, క్రునాల్ పాండ్యా వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్లో భువనేశ్వర్, హేజిల్వుడ్, యశ్ దయాల్, లుంగి ఎంగిడి వంటి అనుభవజ్ఞులు ఉండటం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుంది.
టాప్ స్పిన్నర్ల కొరత
ఆర్సీబీ టీమ్లో ఈసారి టాప్ క్లాస్ స్పిన్నర్ లేకపోవడం లోటు కానుంది. ఆల్రౌండర్ క్రునాల్ పాండ్యా జట్టు స్పిన్ విభాగాన్ని నడిపించనున్నాడు. తను గత సీజన్లో 14 మ్యాచ్ల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు. మరో స్పిన్నర్ సుయాష్ శర్మ గత సీజన్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అలాగే, భువనేశ్వర్, యశ్ దయాల్ తర్వాత మరో బలమైన ఇండియా పేసర్ లేడు.
కొత్తగా రసిఖ్ సలామ్ దార్ను రూ. 6 కోట్లు పెట్టి తీసుకున్నా అతనికి అనుభవం తక్కువే. అదే సమయంలో ఫారిన్ ప్లేయర్లకు గాయాలైతే జట్టుకు సమస్యగా మారనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ ఆల్రౌండర్ జాకబ్ బెతెల్ గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు. తను ఐపీఎల్కు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో ఆడని ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ ఫిట్నెస్పైనా అనుమానాలు ఉన్నాయి.
ఎంత దూరం
ఆర్సీబీ టీమ్ యంగ్స్టర్స్, సీనియర్లతో పేపర్పై మెరుగ్గానే కనిపిస్తోంది. రజత్ పటీదార్కు కెప్టెన్సీ అప్పగించడం కత్తికి రెండు వైపులా పదును పెట్టడం అని ఫ్రాంచైజీ చెప్పింది. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో తను మధ్యప్రదేశ్ జట్టును నడిపించాడు. కానీ సూపర్ స్టార్లు, ఫారిన్ ప్లేయర్లతో కూడిన ఐపీఎల్ టీమ్కు కెప్టెన్సీ అంత ఈజీ కాదు.
జట్టును చూస్తే గతంలో మాదిరిగా ప్లేఆఫ్స్కి చేరే సామర్థ్యం కనిపిస్తోంది. కానీ, కీలక పొజిషన్లకు బ్యాకప్స్ లేకపోవడం, పెద్దగా అనుభవం లేని వ్యక్తి కెప్టెన్సీ చేపట్టడం ఇబ్బందిగా మారొచ్చు. దీన్ని అధిగమిస్తే ఏడాది వ్యవధిలోనే టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ అందుకున్న విరాట్ కోహ్లీ తన కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని కూడా అందుకునే చాన్సుంది.
ఆర్సీబీ టీమ్
బ్యాటర్లు: విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్
ఆల్రౌండర్లు: క్రునాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, మనోజ్ భండాగే, జేకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్
వికెట్ కీపర్లు: ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ
ఫాస్ట్ బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్, రసిఖ్ సలామ్, నువాన్ తుషారా, లుంగి ఎంగిడి;
స్పిన్నర్లు: సుయాష్ శర్మ, మోహిత్ రాథీ