కేసులో రాజీ కుదర్చకుంటే.. పెట్రోల్ పోసుకుని చనిపోతా!

 కేసులో రాజీ కుదర్చకుంటే..  పెట్రోల్ పోసుకుని చనిపోతా!
  • వరంగల్ సీపీ ఆఫీస్ ఎదుట మహిళా సూసైడ్​ అటెంప్ట్​
  • ఆమెపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు

హనుమకొండ, వెలుగు:  భర్తపై పెట్టిన కేసులో రాజీ కి ఒప్పించాలంటూ ఓ మహిళ వరంగల్ పోలీస్​కమిషనరేట్ వద్ద సూసై‌‌డ్​ అటెంప్ట్ చేసింది. ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వెంటనే స్టేషన్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్​నగర్​కు చెందిన కడావత్​ సంగీత రెండు పెళ్లిళు చేసుకోగా వివిధ కారణాలతో వారికి దూరంగా ఉంటూ ముంబైకి వెళ్లిపోయింది. అక్కడ మహబూబాబాద్ ​జిల్లా గార్ల మండలం కోట్యా నాయక్​ తండాకు చెందిన శ్రీనుతో పరిచయం ఏర్పడింది. 

8 ఏండ్ల కింద శ్రీనును మూడో పెండ్లి చేసుకోగా.. కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అనంతరం ఆమె తన తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్​తో కలిసి కేసు పెట్టింది. కాగా.. ఇల్లు, భూమి విషయంలో ఆమెకు కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తాయి. ఆ తర్వాత మళ్లీ శ్రీను వద్దకే వచ్చి వడ్డేపల్లిలో ఉంటోంది. దీంతో ఇదివరకు భర్తపై పెట్టిన కేసులో తన కుటుంబ సభ్యులను రాజీకి ఒప్పించి, తన భూమి తనకు ఇప్పించాలం టూ బుధవారం సుబేదారి పోలీస్​స్టేషన్​కు వెళ్లింది. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మధ్యాహ్నం పెట్రోల్ ​డబ్బాతో వరంగల్ సీపీ ఆఫీస్​వద్దకు చేరుకుంది.

అక్కడ ఆమె ఒంటిపై పెట్రోల్ ​పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీస్ సిబ్బంది ఆమెను అడ్డుకుని సర్దిచెప్పి స్టేషన్​కు తీసుకెళ్లారు.  కాగా కేసులో రాజీ కుదర్చాలని, లేదంటే చస్తానంటూ హెడ్​  క్వార్టర్స్ ఎదుట న్యూసెన్స్​ చేసిన మహిళపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సుబేదారి పోలీసులు తెలిపారు.