ఏ నిమిషానికి : ఆర్టీసీ బస్సులో.. సీట్లోనే చనిపోయిన మహిళ

ఏ నిమిషానికి : ఆర్టీసీ బస్సులో.. సీట్లోనే చనిపోయిన మహిళ

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు.. ఈ మాట అక్షర సత్యం అవుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు ఎంతో ఆరోగ్యంగా.. ప్రశాంతంగా.. ఉల్లాసంగా ఉన్న ఓ మహిళ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ.. కూర్చున్న సీట్లోనే గుండెపోటుతో చనిపోయింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి గ్రామం దగ్గర.. 2024, సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..

మామిడిపల్లి గ్రామానికి చెందిన మహిళ.. సూర్యాపేటలో ఆస్పత్రికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఎంతో చక్కగా.. ఉత్సాహంగానే బస్సు ఎక్కిన మహిళ.. బస్సులోని సీట్లోనే తుది శ్వాస విడిచింది. మామిడిపల్లి నుంచి జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లికి దగ్గరకు బస్సు వచ్చిన తర్వాత.. సీట్లోని మహిళ పక్కకు ఒరిగిపోయింది. ఇది గమనించిన పక్క సీట్లో వారు.. ఆ మహిళను లేపటానికి ప్రయత్నించారు.

అయితే ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. తీవ్ర గుండెపోటు వల్ల ఆమె చనిపోయినట్లు చెబుతున్నారు. విషయాన్ని ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండెక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ ద్వారా మహిళ మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.