ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయిన యువతి

ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయిన యువతి

సోషల్‌ మీడియాలో ఏదోరకంగా వైరల్‌ కావాలి.. రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోవాలి. నేటితరం యువత ఆలోచనలివే. అందుకోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. కొందరు పాటలు.. మరికొందరు డ్యాన్స్‌‍లు.. ఇంకొందరు బూతులు.. ఇలా ఎవరి పిచ్చి వారికి ఆనందమన్నట్టు ఎవరికీ తోచింది వారు చేస్తున్నారు. అలాంటి వ్యామోహంతో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రమాదవశాత్తూ 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో చోటుచేసుకుంది. 

అసలేం జరిగిందంటే..?

కుటుంబసభ్యులతో కలిసి ఓ యువతి హరిద్వార్‌లోని మానసా దేవి హిల్స్‌ అందాలను తిలకించేందుకు వెళ్ళింది. అక్కడ కుటుంబసభ్యులతో కలిసి కొన్ని ఫోటోలు దిగింది. అనంతరం తనను ఒంటరిగా ఫోటోలు తీయాలంటూ కుటుంబసభ్యులకు చెప్పి కొండ అంచు వరకు వెళ్లింది. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ కొండపై నుండి 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. హుటాహుటీన కుటుంబసభ్యులు.. స్థానికులు, సహాయక సిబ్బంది సహకారంతో యువతి లోయలో పడిన ప్రాంతానికి చేరుకున్నారు.

ALSO READ | జేఈఈ పాస్ కాలేమోనని భయంతో.. బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

అప్పటికే యువతి అక్కడ తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితో పడి ఉంది. వెంటనే సహాయక సిబ్బంది ఆమెను రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోయలో పడిన యువతిని ముజఫర్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల రేషుగా అధికారులు గుర్తించారు.