
ఏడాది క్రితమే పెద్దలను ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అందరికీ దూరంగా బతకాలని హైదరాబాద్ లోని ఉప్పల్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. ఇద్దరి కాపురం సంవత్సరం గడిచింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు... ఉప్పల్లో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటకు చెందిన సంపత్, ఆకుల మనీషా(24) సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతాపూర్లోని కామాక్షిపురంలో నివాసం ఉంటున్నారు. అయితే మనీషా తన భర్త లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.
ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు తెలిపారు. భార్యా భర్తల మధ్య కామన్ గా ఉండేవే కదా అని అనుకున్నామని, మనీషా ఆత్మ హత్య చేసుకుంటుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.