
‘తెలంగాణ సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు నెలకొని ఉన్నాయి. ఈ దురాచారాలే స్త్రీల ఆర్థిక, మానసిక పెరుగుదలకు అడ్డంకిగా తయారయ్యాయి. స్త్రీలు ఎక్కడ స్వతంత్రులు అవుతారోనని సమాజం వారికి చదువు కూడా దూరం చేసింది’ అని తెలంగాణ స్త్రీల పరిస్థితి గురించి 1935లో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు జోగినేపల్లి రాధాబాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలోని భూస్వాముల ఇళ్లల్లో ఉండే సాంఘిక దురాచారం ఆడపాప లేదా దాసి
ఆడపాప లేదా దాసి అంటే భూస్వాముల చెల్లెళ్లు, కూతుళ్లకు వివాహమై అత్తగారింటికి వెళ్లేటప్పుడు వారి ఇళ్లల్లో పనిచేయడానికి అవివాహిత బాలికలను తోడుగా పంపించేవారు. ఇలా తోడు వచ్చిన బాలికలను భూస్వాములు వెట్టిచాకిరి చేయించుకోవడమే కాకుండా, శారీరకంగా కూడా ఉపయోగించుకునేవారు. ఇలాంటి బాలికలను ఆడపాప లేదా దాసి అంటారు.
తెలంగాణలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో జోగినీ దురాచారం ఎక్కువ
జోగిని అంటే దళిత కుటుంబాలకు చెందిన బాలికలను గ్రామ దేవతలకు అంకితం చేసేవారు. గ్రామంలోని ధనవంతులు, పూజారులు, ఇతర గ్రామోద్యోగులు వారిని శారీరకంగా ఉపయోగించుకునేవారు. ఇలాంటి బాలికలను జోగినీలు అంటారు.
- 1907లో బాలిక విద్య కోసం హైదరాబాద్లోవివేకవర్ధిని బాలిక పాఠశాలను స్థాపించారు.
- బాలికల కోసం భాగ్యరెడ్డివర్మ ఆది ఆంధ్ర బాలికల పాఠశాల స్థాపించారు.
- హైదరాబాద్లోని నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల ఉంది.
గ్రంథాలయాలను స్థాపించడం, సాంఘిక విషయాలను చర్చించడం, మూఢనమ్మకాలు, మూఢాచారాలకు వ్యతిరేకంగా కృషి చేయడానికి 1878లో యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్ను అఘోరనాథ చటోపాధ్యాయ ఏర్పాటు చేశారు.
-స్త్రీ విద్య కోసం కృషి చేసిన ముస్లిం సంఘ సంస్కర్త ముల్లా అబ్దుల్ ఖయ్యూం
-1907లో సీతాభాయి భారత మహిళా సమాజాన్ని ఏర్పాటు చేశారు.
-1905లో ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ఏర్పాటు చేశారు.
- 1922లో సికింద్రాబాద్లో యువతీ శరణాలయాన్ని యామినీ పూర్ణ తిలకం స్థాపించారు.
- 1930లో ఆంధ్ర మహిళా సభ ఏర్పడింది.
- 1930 నుంచి 1946 మధ్య ఆంధ్రమహాసభ 13 సమావేశాలు నిర్వహించగా 10 మహిళా సమావేశాలు జరిగాయి.
- ఆంధ్ర మహిళాసభ మొదటి సమావేశం జోగిపేటలో జరిగింది.
- జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశంలో స్త్రీ విద్య, వివాహం, వితంతుల పరిస్థితి, వ్యభిచారం వంటి సమస్యలపై చర్చించారు.
- రెండో ఆంధ్ర మహిళాసభ సమావేశం నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది. ఈ సభకు టి.వరలక్ష్మమ్మ అధ్యక్షత వహించారు.
- టి.వరలక్ష్మమ్మ ఒక బ్రాహ్మణ వితంతువు. అయినా ధైర్యంగా పునర్వివాహం చేసుకొని, వితంతు వివాహాలకు మార్గదర్శిగా నిలిచారు. పరదా పద్ధతిని నిరసించారు. కళావంతుల స్త్రీలు కూడా వివాహం చేసుకోవాలని హితవు చెప్పారు.
-1934లో ఖమ్మంలో జరిగిన మూడో ఆంధ్ర మహిళా సభ సమావేశానికి యల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో స్త్రీల వివాహ వయసుపై చర్చలు జరిగాయి. 1935లో సిరిసిల్లలో జరిగిన నాలుగో ఆంధ్ర మహిళా సభ సమావేశానికి మాడపాటి హనుమంతరావు సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారు.
సిరిసిల్లలో జరిగిన నాలుగో ఆంధ్ర మహిళా సభ సమావేశంలో బాల్య వివాహాలు, నిర్బంధ ప్రాథమిక విద్యపై తీర్మానం చేశారు.
- 1936లో ఆంధ్ర మహిళా సభ ఐదో సమావేశం షాద్నగర్లో జరిగింది. ఈ సమావేశానికి బూర్గుల అనంతలక్ష్మి అధ్యక్షత వహించారు.