అమ్మాయిలూ ఆల్‌ ది బెస్ట్‌..విమెన్స్ అండర్‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడే

అమ్మాయిలూ ఆల్‌ ది బెస్ట్‌..విమెన్స్ అండర్‌‌‌‌19  టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడే
  • సౌతాఫ్రికాతో యంగ్ ఇండియా ఫైట్‌‌
  • మ. 12 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌, హాట్ స్టార్‌‌‌‌లో లైవ్‌‌

కౌలాలంపూర్‌‌‌‌ : అటు బ్యాటింగ్‌‌.. ఇటు బౌలింగ్‌‌లో తిరుగులేని పెర్ఫార్మెన్స్​ చేస్తూ  ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తున్న యంగ్ ఇండియా విమెన్స్‌‌ టీ20 అండర్‌‌‌‌19 వరల్డ్ కప్‌‌లో వరుసగా రెండో టైటిల్‌‌పై గురి పెట్టింది. తమ అజేయ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఆదివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికా పని పట్టేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్‌‌గా బరిలోకి దిగిన నిక్కి ప్రసాద్‌‌ కెప్టెన్సీలోని ఇండియా టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌‌ల్లోనూ గెలిచింది. ప్రతీ పోరులోనూ అద్భుతంగా ఆడింది. వెస్టిండీస్‌‌ (9 వికెట్ల తేడాతో), మలేసియా (10 వికెట్లతో), శ్రీలంక (60 రన్స్‌‌తో), బంగ్లాదేశ్ (8 వికెట్లతో), స్కాట్లాండ్ (150 రన్స్‌‌తో)పై ఏకపక్ష విజయాలు సాధించిన అమ్మాయిలు.. 

సెమీఫైనల్లో గతేడాది రన్నరప్‌‌ ఇంగ్లండ్‌‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. బ్యాటింగ్‌‌లో తెలంగాణ ప్లేయర్‌‌‌‌ గొంగడి త్రిష జట్టును ముందుండి నడిపిస్తోంది. సూపర్ ఫామ్‌‌లో ఉన్న త్రిష ఈ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌‌ల్లో ఏకంగా 66.25 సగటుతో 265 రన్స్‌‌తో టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచింది. మరో ఓపెనర్‌‌‌‌ జి. కమలిని 45 సగటుతో 65 రన్స్ చేసింది. ఫైనల్లోనూ ఈ ఇద్దరూ జట్టుకు అత్యంత కీలకం కానున్నారు. అయితే, అన్ని మ్యాచ్‌‌ల్లో ఓపెనర్లే సత్తా చాటడంతో మిడిల్‌‌, లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు పరీక్ష ఎదురుకాలేదు. ఒకవేళ ఫైనల్లో టాపార్డర్ నిరాశపరిస్తే జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మిడిలార్డర్‌‌‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇక బౌలింగ్‌‌లో ఇండియాకు ఎదురేలేదు. ఇండియా లెఫ్టార్మ్ స్పిన్ ద్వయం వైష్ణవి శర్మ (15 వికెట్లు), ఆయుషి శుక్లా (12) ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. వీరికి తోడు పరుణిక సిసోడియా, త్రిష కూడా సత్తా చాటుతున్నారు. ఫైనల్‌‌ కూడా స్లో, టర్నింగ్ వికెట్‌‌పైనే జరుగుతున్న నేపథ్యంలో స్పిన్నర్లు తమ జోరును కొనసాగిస్తే ఇండియా టైటిల్ నిలబెట్టుకోవడం కష్టమేం కాబోదు.

సఫారీలు తక్కువేం కాదు..

అనూహ్యంగా ఫైనల్‌‌కు వచ్చిన సౌతాఫ్రికాను ఇండియా తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆ జట్టు కూడా అజేయంగా తుదిపోరుకు చేరుకుంది. సెమీస్‌‌లో బలమైన ఆస్ట్రేలియాకు చెక్ పెట్టింది. త్రిష మాదిరిగా ఓపెనర్‌‌‌‌ జెమ్మా బోతా పవర్ హిట్టింగ్‌‌తో సత్తా చాటుతోంది. కైలా రేనెకె కెప్టెన్సీలోని సఫారీ జట్టులో ఏడుగురు వరుసగా రెండో ఎడిషన్‌‌లో పోటీపడుతున్నారు. సౌతాఫ్రికా స్పిన్ విభాగం కూడా బలంగా ఉంది. 

సెమీస్‌‌లో ఆసీస్‌‌ కోల్పోయిన ఎనిమిది వికెట్లలో ఆరు స్పిన్నర్లే తీశారు. రేనెకె (10 వికెట్లు) ఆ జట్టు టాప్ వికెట్‌‌ టేకర్‌‌‌‌గా ఉంది. సౌతాఫ్రికా, ఇండియా సెమీస్‌‌ ఆడిన తుది జట్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక,  ఫైనల్‌‌ రోజు వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షంతో ఆట రద్దయినా.. రిజర్వ్ డే (సోమవారం) ఉంది.