
- రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం
- మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
- హత్య వెనుక ఎవరున్నా
- వదిలిపెట్టొద్దని పోలీసులకు ఆదేశం
- భూ తగాదా విషయంలో నలుగురు కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లయింట్
- పెద్ద లీడర్ల హస్తం ఉందని ఆరోపణ
- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు!
- ముగిసిన రాజలింగమూర్తి అంత్యక్రియలు
జయశంకర్ భూపాలపల్లి / భూపాలపల్లి రూరల్, వెలుగు: భూపాలపల్లి పట్టణంలో జరిగిన రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం రేగుతున్నది. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే ఈ మర్డర్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. ఈ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. ఈ విషయంసై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. హత్య వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి, పూర్తి ఆధారాలు సేకరించాలని, దోషులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. కాగా, భూ తగాదా విషయంలోనే తన భర్తను నలుగురు వ్యక్తులు కలిసి హత్య చేశారని, వీరి వెనుక పెద్ద లీడర్ల పాత్ర ఉందనే అనుమానాలున్నాయని మృతుడి భార్య సరళ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు.
రాజలింగ మూర్తిని హత్య చేసిన వారిలో ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డట్టు ప్రచారం జరుగుతున్నది. మరో ఇద్దరికోసం ప్రత్యేక టీమ్ల ద్వారా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాజలింగ మూర్తి మృతదేహానికి పోలీసులు గురువారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎలాంటి గొడవలు లేకుండా అతడి అంత్యక్రియలు జరిగాయి.
భూ తగాదా విషయంలో హత్య!
భూపాలపల్లి టౌన్లోని పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న భూమి విషయంలో రేణికుంట్ల కొమురయ్య, రేణికుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో తమకు కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని పోలీస్ కంప్లయింట్లో సరళ తెలిపింది. ఈ భూమి విషయంలో సివిల్ కోర్టులో కేసు నడుస్తున్నదని, తమకు అనుకూలంగా తీర్పు వచ్చే సమయంలోనే ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తన భర్త రాజలింగ మూర్తిని కిరాతకంగా హత్య చేశారని పేర్కొన్నది.
రేణికుంట్ల సంజీవ్, పింగిళి శ్రీమంత్, మోరె కుమార్, కొత్తూరి కుమార్ అనే నలుగురు బుధవారం రాత్రి టూ వీలర్పై వస్తున్న తన భర్త రాజలింగ మూర్తిని రోడ్డుపైనే అడ్డగించి.. తలపై రాడ్డుతో కొట్టి కత్తులతో పొడిచి హత్య చేశారని వివరించింది. అనంతరం రెండు టూ వీలర్లపై పారిపోయినట్టు కంప్లయింట్లో పేర్కొన్నది. తన భర్తను హత్య చేయాలని కొందరు పొలిటికల్ లీడర్లు వెనుకనుంచి ప్రోత్సహించినట్టు తనకు అనుమానం ఉందని, దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
రాజలింగమూర్తి మృతిపై భార్య సరళ బుధవారం రాత్రి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో 117/2025 నంబర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్లోని 191 (2), 191 (3), 61 (2), 126 (2), 103 (2), రెడ్విత్ 190 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరేశ్ కుమార్ వెల్లడింంచారు. రాజలింగమూర్తిని చంపిన వారిలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. మర్డర్ కోసం ఉపయోగించిన కత్తిని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక టీమ్లు వేసి, గాలిస్తున్నారు.
జంగేడులో ముగిసిన అంత్యక్రియలు
భూపాలపల్లి పట్టణంలో హత్యకు గురైన రాజలింగమూర్తి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన పోలీసులు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజలింగమూర్తి స్వస్థలం అయిన జంగేడు శివారు పక్కీరుగడ్డకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దు!
రాజలింగమూర్తి మర్డర్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాల్సిందే.ఈ మర్డర్ వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా పోలీసులు వదిలిపెట్టొద్దు. ప్రశాంతంగా ఉన్న భూపాలపల్లిలో హత్యా రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులు అన్ని విషయాలను లోతుగా పరిశీలించి, నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరచాలి. ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఇలా హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదు.‒ గండ్ర సత్యనారాయణరావు,ఎమ్మెల్యే, భూపాలపల్లి
ఎంతటి వారినైనాపట్టుకొని శిక్షిస్తం
రాజలింగమూర్తి హత్య విషయంలో ఆయన భార్య ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం. దీని వెనుక ఎంతటి వారున్నా పట్టుకొని శిక్షిస్తాం. చట్టప్రకారం ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది. త్వరలోనే హత్యలో పాల్గొన్న నిందితులు ఎవరు? వారికి సహకరించింది ఎవరు? వంటి విషయాలన్నీ బయటపడతాయి. సాధ్యమైనంత త్వరగా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం.
‒ సంపత్రావు, భూపాలపల్లి డీఎస్పీ -