శ్రీశైలం డ్యామ్​ రిపేర్లకు రూ.103 కోట్లు మంజూరు

శ్రీశైలం డ్యామ్​ రిపేర్లకు రూ.103 కోట్లు మంజూరు
  • డ్యామ్ ను​ సందర్శించిన ప్రపంచ​ బ్యాంక్​ ప్రతినిధుల బృందం

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టును వరల్డ్​ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. రెండు రోజులుగా డ్యామ్​ను పరిశీలించిన సభ్యులు మంగళవారం ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. గేట్ల దిగువన ప్లంజ్​ ఫూల్​ వద్ద ఏర్పడిన గొయ్యి, అప్రోచ్  రోడ్డు, డ్యామ్  గేట్లు, కొండ చరియలు విరిగిపడకుండా తీసుకునే చర్యలపై చర్చించారు. ప్రపంచ బ్యాంక్​ ద్వారా ఫేజ్–1 కింద డ్యామ్​ రిపేర్ల కోసం రూ.103 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. 

ఈ సందర్భంగా బృందం సభ్యులు డ్యామ్​ వద్దకు వెళ్లి డ్యామ్​ సేఫ్టీ గురించి ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు సీఈ కబీర్  బాషా, డ్యామ్  సేఫ్టీ ఆఫీసర్​ నూతన కుమార్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం డ్యామ్​  రిపేర్ల కోసం ఫేజ్–1 కింద రూ.103 కోట్లు మంజూరుకు ప్రపంచ బ్యాంక్​ ప్రతినిధులు ఆమోదం తెలిపారని చెప్పారు. వచ్చే నెల టెండర్లు పిలుస్తామన్నారు. భారీ వరదల వల్ల డ్యామ్​ ముందు భాగంలో ప్లంజ్​ పూల్​ వద్ద 46 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడిందన్నారు.

దీన్ని పూడ్చేందుకు రూ.10 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. జలాశయం అప్రోచ్  రోడ్డు, కొండ చరియల రిపేర్లు చేస్తామని చెప్పారు. 2011 నుంచి 2024 వరకు పూడిక ద్వారా ప్రాజెక్టులో 9 టీఎంసీలు నీరు తగ్గిందన్నారు. రానున్న మూడేండ్లలో పూడికపై అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు.