ఆర్థిక రంగంలో భారత్​ పరుగులు

ఆర్థిక రంగంలో భారత్​ పరుగులు
  • రాబోయే సంవత్సరాల్లో మరింత వేగంగా అభివృద్ధి
  • ప్రపంచ బ్యాంకు రిపోర్ట్​లో వెల్లడి: ప్రధాని నరేంద్ర మోదీ
  • సౌరశక్తిలో సూపర్‌‌ పవర్‌‌గా ఇండియా
  • మధ్యప్రదేశ్​లో గ్లోబల్​ ఇన్వెస్టర్​ సమిట్​లో ప్రధాని ప్రసంగం

భోపాల్: ఆర్థిక రంగంలో భారత్​ పరుగులు పెడుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ భారత్‌‌ ప్రపంచంలో  వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు రిపోర్ట్​లో చెప్పినట్టు గుర్తుచేశారు. మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో సోమవారం నిర్వహించిన గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ సమిట్​లో ప్రధాని మోదీ పాల్గొని, మాట్లాడారు. 

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని అన్నారు. గ్లోబల్​ ఏరోస్పేస్ ​సంస్థలకు దేశం​ టాప్​ సప్లై చెయిన్​గా ఎదుగుతున్నదని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో టెక్స్​టైల్స్​, టూరిజం, టెక్నాలజీ రంగాలు కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. సోలార్​ ఎనర్జీలో భారత్ సూపర్‌‌ పవర్‌‌గా మారిందని యునైటెడ్​ నేషన్​(యూఎన్)​కు చెందిన ఓ విభాగం ప్రశంసించిందని తెలిపారు. 

ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే.. భారత్‌‌ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థే పేర్కొన్నదని అన్నారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయని తెలిపారు. దేశంలో హెల్త్ అండ్ వెల్‌‌నెస్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, ‘హీల్ ఇన్ ఇండియా’ మంత్రాన్ని ప్రపంచం ఇష్టపడుతున్నదని అన్నారు. 

కాగా, 10,12వ తరగతుల స్టూడెంట్లకు ఎగ్జామ్స్​ జరుగుతున్నాయని, వారి పరీక్షకు వెళ్లే సమయం కావడంతో.. తాను ఈ కార్యక్రమానికి లేట్​గా బయలుదేరానని మోదీ అక్కడున్నవారికి తెలిపారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరారు.

ఎంపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

మధ్యప్రదేశ్​లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రంలో మేజర్​ ఇన్వెస్ట్​మెంట్స్​ను ఆకర్షించడమే లక్ష్యంగా 18 కొత్త పాలసీలను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్​ జనాభాపరంగా  ఐదో అతిపెద్ద రాష్ట్రమని, వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందువరుసలో ఉన్నదని మోదీ చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. 

ఒబెసిటీ వ్యతిరేక ప్రచారానికి 10 మంది పేర్లు..

దేశంలో ఒబెసిటీపై పోరాటానికి ప్రధాని మోదీ 10 మంది ప్రముఖులను నామినేట్​ చేశారు. వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌‌ మహీంద్రా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్‌‌ అబ్దుల్లా, సినీ నటుడు మోహన్​లాల్ ఉన్నారు. అలాగే, ​భోజ్​పురి సింగర్​ నిరహువా, షూటర్​మను బాకర్​, వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నందన్​నిలేకని, యాక్టర్​ ఆర్. మాధవన్​, సింగర్​ శ్రేయ ఘోషాల్​, ఎంపీ సుధామూర్తిని మోదీ నామినేట్​ చేశారు.  

ఈ మేరకు  ఎక్స్​లో ప్రధాని పోస్ట్ పెట్టారు. ‘‘ఒబేసిటీకి వ్యతిరేకంగా మన పోరాటాన్ని బలోపేతం చేయడంతోపాటు ఆహారంలో ఆయిల్​ వాడకాన్ని తగ్గించడంపై అవగా హన కల్పించేందుకు వీరిని నామినేట్‌‌ చేస్తున్నా. వీరంతా ఒక్కొక్కరూ 10 మంది చొప్పున వ్యక్తులను నామినేట్‌‌ చేయాలని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.