WCL T20: దిగ్గజాల మధ్య పోరు.. రేపటి నుంచే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్

WCL T20: దిగ్గజాల మధ్య పోరు.. రేపటి నుంచే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్

బుధవారం (జూలై 3) నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడతారు. దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే అభిమానులకు ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచనుంది. జూలై 3 (బుధవారం) నుండి జూలై (శనివారం) 13 వరకు లెజెండ్స్ లీగ్ జరగనుంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలో మొత్తం 6 దేశాలు ఈ టోర్నీలో ఆడతాయి. ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు 10 రోజుల పాటు జరిగే ఈ మెగా లీగ్ లో టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

అందరూ ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూలై 6న జరగనుంది. ఎడ్జ్ బాస్టన్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. భారత జట్టుకు యువరాజ్ కెప్టెన్సీ చేస్తుండగా.. పాకిస్థాన్ జట్టును షాహిద్ ఆఫ్రిది లీడ్ చేయనున్నాడు. మ్యాచ్ లు ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక మ్యాచ్.. సాయంత్రం 5 గంటలకు మరో మ్యాచ్ జరుగుతుంది. సురేశ్ రైనా, డేల్ స్టెయిన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, కెవిన్ పీటర్సన్, బెన్ కట్టింగ్, షాన్ మార్ష్, ఇమ్రాన్ తాహిర్, షాహిద్ అఫ్రిది, యువరాజ్ సింగ్, ఆరోన్ ఫించ్, బ్రెట్ లీ వంటి మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. 

టోర్నమెంట్ ఫార్మాట్, షెడ్యూల్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ లో మొత్తం 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ తరహాలో ఈ లీగ్ ఉంటుంది. ప్రతి జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒకసారి తలపడుతుంది. ఈ మ్యాచ్ లకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్ ఆతిధ్యమిస్తాయి. లీగ్ దశల్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు శుక్రవారం (జూలై 12) సెమీ ఫైనల్‌కు ఆడతాయి.   శనివారం (జూలై 13) ఫైనల్ జరుగుతుంది.