డీఎంహెచ్​వో VS డాక్టర్లు .. యాదాద్రి వైద్యారోగ్యశాఖలో ఇంటి పోరు

డీఎంహెచ్​వో VS డాక్టర్లు .. యాదాద్రి వైద్యారోగ్యశాఖలో ఇంటి పోరు
  • డిప్యూటేషన్ల వ్యవహారం తెరపైకి క్యాన్సిల్ చేయాలని కలెక్టర్​కు డీఎంహెచ్​వో నోట్ ఫైల్​
  • తలలు పట్టుకుంటున్న స్టాఫ్​

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా వైద్యారోగ్యశాఖలో ఇంటర్నల్ వార్ నడుస్తోంది. డీఎంహెచ్​వో, డాక్టర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటేషన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. డిప్యూటేషన్లు క్యాన్సిల్ చేయాలంటూ కలెక్టర్​కు డీఎంహెచ్​వో నోట్ ఫైల్ పెట్టడం చర్చనీయంగా మారింది. 

గూగుల్​ మీట్.. 

యాదాద్రి జిల్లా హైదరాబాద్​కు సరిహద్దుగా ఉంది. గంటన్నర ప్రయాణంలో హైదరాబాద్​ నుంచి జిల్లా హెడ్​ క్వార్టర్ భువనగిరికి రావచ్చు. రూరల్ మండలాలకు వెళ్లాలంటే మరో గంట సమయం అదనంగా పడుతోంది. దీంతో ఈ జిల్లాలో హెల్త్ డిపార్ట్​మెంట్​సహా ప్రతి డిపార్ట్​మెంట్ లో పని చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్​ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీలకమైన వైద్యారోగ్య శాఖను గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ డిపార్ట్​మెంట్​పై కలెక్టర్ హనుమంతరావు దృష్టి సారించారు. 

ఇందులో భాగంగా ఓపీ టైమ్ కంటే ఐదు నిమిషాల ముందే ఉదయం 8.55 గంటలకు పీహెచ్​సీల నుంచి ప్రతిరోజూ గూగుల్ మీట్​ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీఎంహెచ్​వో ​మనోహర్ రెగ్యులర్​గా గూగుల్​మీట్​ నిర్వహిస్తున్నారు. ఇది నచ్చని కొందరు డాక్టర్లు చూసీచూడనట్టుగా వదిలేయాలని డీఎంహెచ్​వోను కోరగా, ఆయన తిరస్కరించారు. 

డీఎంహెచ్​వోను ప్రశ్నించిన డాక్టర్లు..

పీహెచ్​సీ మెడికల్​ఆఫీసర్ల గూగుల్ మీట్​లో ప్రతిఒక్కరినీ వీడియో ఆన్ చేయాలని డీఎంహెచ్​వో మనోహర్​ సూచించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వీడియో ఆన్ చేయకుంటే.. మీరు డ్యూటీలో ఉన్నట్టు ఎలా తెలుస్తుందని డీఎంహెచ్​వో చెప్పడం కొందరు డాక్టర్లకు నచ్చలేదు. తాము మహిళా డాక్టర్లమని, వీడియో ఆన్​ చేయమనడం ఎంతవరకూ కరెక్ట్ అని కొందరు, నమ్మకం లేదా? అని మరికొందరు ప్రశ్నించినట్టుగా 
తెలిసింది. 

తెరపైకి డిప్యూటేషన్ల వ్యవహారం..

కలెక్టర్​ అనుమతితో ప్రస్తుత డీఎంహెచ్​వో మనోహర్ పది మందికి డిప్యూటేషన్​ ఇచ్చారు. ఈ వ్యవహారంలో డబ్బు చేతులు మారిందని డిపార్ట్​మెంట్​లో చర్చ మొదలైంది. ఈ పరిణామాల క్రమంలో గతంలో జరిగిన డిప్యూటేషన్ల వ్యవహారంపై డీఎంహెచ్​వో మనోహర్​దృష్టి పెట్టి లెక్కలు తీశారు. జిల్లా ఏర్పడిన తర్వాత బాధ్యతలు నిర్వర్తించిన డీఎంహెచ్​వోల ఆధ్వర్యంలో మొత్తంగా 103 మంది డిప్యూటేషన్లు జరిగాయని తేలింది. ఇందులో డీఎంహెచ్​వోగా బాధ్యతలు నిర్వహించిన పాపారావు, పరిపూర్ణాచారి హయాంలో 70 మందికి పైగా జరిగాయి. 

అనంతరం ఇన్​చార్జిగా వ్యవహరించిన యశోద హయాంలో కొందరు డిప్యూటేషన్లపై వెళ్లారు. ఈ డిప్యూటేషన్ల వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ఇందులో కొందరు కీలకంగా వ్యవహరించారని హెల్త్ డిపార్ట్​మెంట్​లో చర్చ జరుగుతోంది. అయితే మొత్తంగా డిప్యూటేషన్లను రద్దు చేయాలని కలెక్టర్​కు డీఎంహెచ్​వో మనోహర్ నోట్​ఫైల్ పెట్టారు. దీంతో ఏ.. ఏ పీహెచ్​సీకి ఎంత మంది అవసరమో లెక్కలు తీసి తనకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పీహెచ్​సీల వారీగా మెడికల్ ఆఫీసర్లతో అవసరమైన స్టాఫ్​ వివరాలను తెప్పించుకున్న డీఎంహెచ్​వో 50 మందికి పైగా డిప్యూటేషన్లు ఇవ్వాలని మరో నోట్ ఫైల్ రెడీ చేశారని హెల్త్ డిపార్ట్​మెంట్​ఎంప్లాయీస్ ద్వారా తెలిసింది. 

రాజీ ప్రయత్నాలు..?

ఈ పరిణామాల క్రమంలో డీఎంహెచ్​వో, డాక్టర్ల మధ్య రాజీ కుదర్చడానికి కొందరు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొందరి కారణంగా రాజీ ప్రయత్నాల్లో ప్రతిష్టంభన నెలకొందని హెల్త్​డిపార్ట్​మెంట్​ స్టాఫ్ చెబుతున్నారు. ఈ పరిణామాలు డిపార్ట్​మెంట్​కు ఇబ్బందికరంగా మారిందని స్టాఫ్​ తలలు పట్టుకొని వాపోతున్నారు.