
హైదరాబాద్, వెలుగు: అవయవ మార్పిడి ప్రాధాన్యత, దీనిపై ఉన్న అపోహలను తొలగించడానికి యశోద హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ హైటెక్ సిటీ బ్రాంచీలో చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్స్, కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్, కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్ సహకారంతో “సెలబ్రేటింగ్ సెకండ్ ఛాన్సెస్ – లైఫ్ విత్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్” పేరిట ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ వ్యూహాల గురించి వివరించారు.
యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జీఎస్రావు మాట్లాడుతూ... తమ హాస్పిటల్స్ లో అధునాతన టెక్నాలజీ, బహుళ వైద్య విభాగాల ద్వారా ప్రపంచ స్థాయి మూత్రపిండాల సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 280 మంది కిడ్నీ మార్పిడి గ్రహీతలు, డయాలసిస్ రోగులు, కిడ్నీ దాతలు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.