రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే

రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే మళ్లీ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం 55ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయన్న కృష్ణ ప్రసాద్ అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోందని వాపోయారు. ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని ఒక్కోసారి అనిపిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం10 మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని కృష్ణ ప్రసాద్ అన్నారు. అది చేతకాకపోవడం వల్లే తాను పాతతరం నాయకుడిగా మిగిలిపోయానని చెప్పారు. మూడున్నరేళ్ల కాలంలో ఒక్కరిపై కూడా అక్రమ కేసులు పెట్టించలేదని, ఈ విషయంలో తనపై తమ పార్టీలోని కొందరు నేతలకు అసంతృప్తి ఉండొచ్చని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని కృష్ణ ప్రసాద్ అన్నారు. 

రైతుల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని... వాటిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణ ప్రసాద్ సూచించారు. గుంటూరులో ఇటీవల నిర్వహించిన టీడీపీ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ఆయన స్పందిస్తూ సేవా కార్యక్రమాలను చేసే వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్నారైలను ఆపడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని అలాంటి వాడిపై ఏవేవో చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తొక్కిసలాట ఘటనను చిలవలు, పలవలు చేసి చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.