వైసీపీకి ఊహించని దెబ్బ.. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా

వైసీపీకి ఊహించని దెబ్బ.. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా

ఢిల్లీ: ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్.కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదించారు. కృష్ణయ్య రాజీనామాతో ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకే రాజీనామా చేశానని ఆర్.కృష్ణయ్య చెప్పారు. 100 బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఏపీ నుంచి ఒక స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం నుంచి బులిటెన్ విడుదల చేశారు. 

ALSO READ | తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

2022లో ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నిక కావడం గమనార్హం. రాజ్యసభ ఎంపీగా ఆయన పదవీ కాలం సుమారు నాలుగేళ్లు ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేశారు. ఆర్.కృష్ణయ్య రాజకీయంగా కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన మోపిదేవి, బీద మస్తాన్ రావు కూడా ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన ఆర్.కృష్ణయ్య 2014లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గత 35 ఏళ్లుగా బీసీ ఉద్యమ నేతగా కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. ఏపీలో 2024లో అధికారం కోల్పోయిన వైసీపీకి ఇటీవల షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పి జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ పవన్తో భేటీ అయ్యారు. తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య కూడా రాజీనామా చేయడంతో వైసీపీలో కలకలం రేగింది.