
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం (మార్చి 26) ఆయన ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా, యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదేళ్ల పాలనను పురస్కరించుకుని లక్నోలోని ఇందిరా గాంధీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆగ్రా నుంచి ప్రత్యేక విమానంలో సీఎం యోగి బయలుదేశారు.
ALSO READ | Basanagouda Patil: బీజేపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే సస్పెండ్
యోగి ప్రయాణిస్తోన్న విమానంలో టేకాఫ్ అయిన కాసేటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానం బ్రేకుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్.. ఫ్లైట్ను ఆగ్రా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అధికారులు ఢిల్లీ నుంచి మరో విమానం రప్పించడంతో యోగి అందులో వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో సీఎం యోగికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా లక్నోలో సీఎం యోగి పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు అయ్యింది.
మరోవైపు.. యోగి ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కు గల కారణాలపై ఫ్లైట్ ఇజంనీర్లు ఆరా తీశారు. విమానం బ్రేకుల్లో సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 8 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయి చేరుకున్న రెండు రోజులకే సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం యూపీ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది.