
- వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణంలో ఘటన
నెక్కొండ, వెలుగు: ప్రేమించిన యువతి కుటుంబసభ్యులు పెండ్లికి నిరాకరించడంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణానికి చెందిన సదువాల శ్యాంకుమార్ ఉరఫ్ అరుణ్(24)కు రెండేండ్ల కింద నర్సంపేటలో ఇంటర్ చదివే సమయంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడకు చెందిన ఓయువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
కొన్ని నెలలుగా వరంగల్లోని ఓ హోటల్లో శ్యాంకుమార్ కుక్గా పని చేస్తున్నాడు. యువతి కొత్తగూడలోనే ఉంటోంది. నెల రోజుల నుంచి పెండ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెండ్లికి యువతి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల3న శ్యాం నెక్కొండలోని తన ఇంట్లో గడ్డిమందు తాగాడు. గమనించిన ప్యామిలీ మెంబర్స్ వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో..
ఘట్కేసర్: ప్రేమ విఫలమై మద్యానికి బానిసైన కొడుకును తల్లి మందలించడంతో ఉరేసుకొని పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడకు చెందిన బండారి సాయిప్రసాద్(24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం ఐటీ కారిడార్ సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పేయింటర్ పని చేసే సాయిప్రసాద్ గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మద్యానికి బానిసయ్యాడు. అప్పటి నుంచి మద్యం తాగి నిత్యం ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. శుక్రవారం రాత్రి తాగి ఇంటికి రాగా, తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.