చదువు ఇష్టం లేక..బ్రిడ్జి పైనుంచి దూకి యువకుడు సూసైడ్​

చదువు ఇష్టం లేక..బ్రిడ్జి పైనుంచి దూకి యువకుడు సూసైడ్​

జీడిమెట్ల, వెలుగు: చదువు ఇష్టం లేక ఓ యువకుడు ఫుట్​ఓవర్​ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. షాపూర్​నగర్​పోలీసుల వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డి సుందరయ్యకాలనీకి చెందిన అల్లి రాంబాబు వ్యవసాయం చేస్తుంటాడు. ఇతనికి ముగ్గురు సంతానం. మూడో కుమారుడు సాయి ప్రకాశ్(20) భద్రాచలంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తనకు చదువు ఇష్టం లేదని, ప్రైవేట్​జాబ్​చేస్తానని ఇంట్లో చెప్పాడు. 

తండ్రి ఇప్పుడే ఉద్యోగం వద్దు.. చదువుకొమ్మని నచ్చజెప్పాడు. సాయిప్రశాక్​వినకుండా 20 రోజుల క్రితం హైదరాబాద్​వచ్చాడు.  తండ్రి రాంబాబు శనివారం రాత్రి 8 గంటలకు షాపూర్​నగర్​వచ్చి, కుమారుడికి ఫోన్​ చేశాడు. అతను 10 గంటలకు తండ్రి వద్దకు రాగా, ఇక్కడ ఉండొద్దని చదువుకోవాలని మరోసారి చెప్పాడు. సాయిప్రకాశ్​అంగీకరించలేదు. తనను ఎలాగైనా ఊరికి తీసుకెళ్తాడన్న భయంతో పరిగెడుతూ.. ఫుట్​ఓవర్​బ్రిడ్జి పైకి ఎక్కి, దూకాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయమైంది. దవాఖానకు తరలిచంగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ట్యాంక్ బండ్​ నుంచి దూకి మరొకరు

ట్యాంక్ బండ్, వెలుగు: ట్యాంక్ బండ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దోమలు గూడ ఇన్స్​పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి  వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ మీద నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగే వద్ద దూకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని బెగ్గర్ గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్​బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.