
- 20 రోజుల్లో ముగ్గురి ఆత్మహత్య..
- సైబర్ మోసానికి మరొకరి బలవన్మరణం
- రోడ్డున పడుతున్న కుటుంబాలు
- రూ.లక్షలు సంపాదించాలన్న ఆశతో అప్పులపాలు
కరీంనగర్, వెలుగు: రాత్రికి రాత్రే రూ.లక్షలు సంపాదించాలనే ఆశతో ఫోన్లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. బెట్టింగ్ కాస్తున్న యువకులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ వ్యసనంగా మారడంతో అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 20 రోజుల్లోనే ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకోవడం బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇందులో రెండు ఘటనలు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోనే జరిగాయి. ఆన్ లైన్ గేమ్స్లో బెట్టింగ్ పెట్టి నష్టపోవద్దని, లింక్ లను క్లిక్ చేయొద్దని ఒకవైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నా కొందరు యువకులు మాత్రం అదే పనిగా గేమ్స్ ఆడుతూ రోడ్డున పడుతున్నారు. తల్లిదండ్రులకు విషాదాన్ని మిగులుస్తున్నారు.
ముందు లాభాలు.. తర్వాత నష్టాలు..
ఇంటర్నెట్లో ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే అందులో ఓ పక్కన ఆన్ లైన్ రమ్మీ, క్యాసినో, రౌలట్ లాంటి గ్యాబ్లింగ్ ఆటలు అనేకం కనిపిస్తుంటాయి. వీటికి అట్రాక్ట్ అయి సరదాగా ఆడడం మొదలుపెడితే ప్రారంభంలో డబ్బులు వచ్చేలా చేసి ఆశ పుట్టిస్తారు. ఆ తర్వాత నాలుగైదుసార్లు డబ్బులు పోగొట్టుకుంటే.. ఒకటి, రెండు సార్లు డబ్బులు లాభం వచ్చేలా చేసి మళ్లీ ఆశ కల్పిస్తారు. ఇలా సాఫ్ట్ వేర్ లోనే సెట్ చేసి పెడతారు.
ఇందులో లాభాలు రావడం కంటే నష్టపోయినవాళ్లే వేలాదిగా ఉంటారు. చాలామంది యువకులకు ఇదొక వ్యసనంగా మారడంతో రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ కోసం లోన్ యాప్ నుంచి, తెలిసినవారి నుంచి, క్రెడిట్ కార్డుల నుంచి అప్పులు చేయడం.. చివరికి అవి తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడం చాలాచోట్ల జరుగుతోంది. ఆస్తులేవి లేని యువకులు డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు..
కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస శంకర్ కుమారుడు కార్తీక్ (25) కొన్నాళ్లు ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. గేమ్ కోసం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో ఆరు నెలల కింద 20 గుంటల పొలం అమ్మి అప్పు తీర్చేశాడు. తర్వాత మరోసారి రూ. 2.50 లక్షలు అప్పు చేసి రమ్మీ ఆడడంతో ఆ డబ్బులు కూడా పోయాయి. దీంతో మనస్తాపానికి గురైన కార్తీక్ జనవరి 30న గ్రామసమీపంలోని వాగు వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎడిగ మధు(33) కొన్నినెలలుగా ఆన్ లైన్ బెట్టింగ్ఆడుతూ రూ.10 లక్షలకుపైగా పోగొట్టుకున్నాడు. అప్పులు చేసి బెట్టింగ్లో పెట్టడంతో అవి చెల్లించలేక కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని టైంలో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. గతంలో ఒకసారి ఇతను బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు.
వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన గుమ్మడి రిషివర్ధన్(18) తన మొబైల్కు వచ్చిన ఆన్లైన్ ట్రేడింగ్ మెస్సేజ్పై క్లిక్ చేశాడు. మొదట రూ.5 వేలు సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. దీనిపై డబుల్ అమౌంట్ పొందాలంటే రూ.23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ డబ్బు చెల్లించాడు. మూడో టాస్క్ లో రూ.68 వేలు పెట్టుబడి పెడితే మొత్తం రీఫండ్ వస్తుందని నమ్మించడంతో ఆ మొత్తం కూడా పంపాడు. ఆ డబ్బులకు రెట్టింపు పొందాలంటే మళ్లీ రూ.2.06 లక్షలను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడంతో తాను మోసపోయినట్లు గుర్తించి మనస్తాపానికి గురై డిసెంబర్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లయిన్ కాలనీకి చెందిన చొప్పరి దేవేందర్ (35) కార్లను అద్దెకు నడుపుతుండటమే కాకుండా, జూలపల్లిలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడి రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతేగాక రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన దేవేందర్ ఆదివారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు.