యూట్యూబర్ ​: ఇండియా గల్లీలో రష్యన్ మ్యారీ

యూట్యూబర్ ​: ఇండియా గల్లీలో రష్యన్ మ్యారీ

ఇండియాను చూసేందుకు ఎన్నో దేశాల నుంచి టూరిస్ట్‌‌‌‌‌‌‌‌లు వస్తుంటారు. టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు చూసి వెళ్లిపోతుంటారు. కానీ.. రష్యాకు చెందిన మ్యారీ చుగ్ మాత్రం అసలైన ఇండియాని చూడటమే కాకుండా అందరికీ చూపిస్తోంది కూడా! ఇండియా వచ్చినప్పటినుంచి ఇక్కడి సంప్రదాయ కట్టు, బొట్టులోనే కనిపిస్తోంది. చుడీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసుకుని, నుదుటు బొట్టు పెట్టుకుని గల్లీగల్లీలో తిరుగుతూ... అందరితో కలిసిపోతూ ఎంజాయ్​ చేస్తోంది.

ఇప్పటికే చాలా దేశాల్లో భారతీయ సంస్కృతి గొప్పదనం గురించి చెప్పుకుంటుంటారు. అయితే ఈ ట్యూబర్​ మ్యారీ మాత్రం మాటల్లో చెప్పడం కాకుండా పాటించి చూపుతోంది. మ్యారీ ఇండియాలో ఎక్కడికి వెళ్లినా.. ‘నమస్తే భయ్యా’, ‘నమస్తే దీదీ’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది. అందుకే కాబోలు ఈ రష్యన్​ యూట్యూబర్​కి తక్కువ టైంలోనే బోల్డంత ఫాలోయింగ్ వచ్చింది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే... ఆమె ఛానెల్​కంటెంట్‌‌‌‌‌‌‌‌ని ఎక్కువగా చూసేది కూడా మనవాళ్లే. 

ఇలా మొదలైంది

మ్యారీ చుగ్ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా జర్నీ ఇండియాలోనే మొదలైంది. రష్యాలో పుట్టి, పెరిగిన మ్యారీకి ఇండియాలో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ల సాయంతో ఇండియాని చూసేందుకు, ఇక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు పోయినేడు జులైలో ఇక్కడికి వచ్చింది. అదే నెల17న తన మొదటి వీడియోను యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి 12 రోజుల ముందు అంటే.. జులై 5న తన యూట్యూబ్ ఛానెల్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్ చేసింది. గోవా నుంచి తన టూర్ మొదలుపెట్టింది మ్యారీ. ఛానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు.

అయినా.. తన ఛానెల్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటివరకు 2.13 మిలియన్ల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఆమె మాట్లాడేది ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లో అయినా.. మనవాళ్లు చాలామంది ఆమె వీడియోలను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తున్నారు. మ్యారీ యూట్యూబ్​ ఛానెల్​లో ఎక్కువగా షార్ట్ వీడియోలని అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఇప్పటివరకు మొత్తం176 వీడియోలను యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసింది. అందులో 20 మాత్రమే పెద్ద వీడియోలు. మిగతావన్నీ షార్ట్‌‌‌‌‌‌‌‌ వీడియోలే. ఆమె పోస్ట్ చేసిన ఒక షార్ట్ వీడియోకు ఏకంగా 70 మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. 10 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు ఛానెల్‌‌‌‌‌‌‌‌లో చాలానే ఉన్నాయి. 

గల్లీల్లోనే ఎక్కువ 

సాధారణంగా విదేశీయులు టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లను చూసి వెళ్లిపోతుంటారు. కానీ.. మ్యారీ మాత్రం ఏ సిటీకి వెళ్లినా అక్కడి గల్లీలను చుట్టేస్తుంది. స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌ టేస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి అడిగి తెలుసుకుంటుంది. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంటుంది. వాస్తవానికి ఆమె వీటికోసమే ఇండియాకు వచ్చింది. ‘‘ఇండియాలోని సంప్రదాయ విలువలు నాకు చాలా ఇష్టం. ధ్యానం, యోగా చేయడం మొదలుపెట్టా. ఇండియా మీద ఉన్న ప్రేమే నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది’’ అని చెప్పింది. ఈ మధ్య ఆమె మహారాష్ట్రలోని ఒక పొలం దగ్గరికి వెళ్లి, అక్కడ టొమాటోలు కోస్తున్న రైతులతో సరదాగా కాసేపు మాట్లాడింది.

టొమాటోలు కోసి, బుట్టలతో మోసి వాళ్లకు సాయం కూడా చేసింది. ఇదంతా వీడియో తీసి, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆ షార్ట్ వీడియోకు మంచి ఆదరణ వచ్చింది. ఆ తర్వాత ముంబయిలో మొక్కజొన్న కంకి తిన్నది. మొక్కజొన్న కంకి తినడం అదే మొదటిసారి అట! ఆ వీడియో చాలా వైరల్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. బీచ్‌‌‌‌‌‌‌‌లో మొక్కజొన్న బుట్టలు అమ్మే స్టాల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ‘నమస్తే భయ్యా’ అని పలకరించింది. ధర కనుక్కుని, ఒక మొక్కజొన్న కంకి కాల్చి ఇవ్వమని అడిగింది. అతను కంకిని నిప్పుల మీద కాల్చే లోపు అక్కడే ఉన్న ఆ స్టాల్​ యజమాని, అతని కొడుకులతో సరదాగా మాట్లాడింది. 

మంచి మనసు

మ్యారీ చేసే పనులతో ఇండియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఆమె ఎక్కడ? ఏం కొనుక్కుని తిన్నా.. చుట్టు పక్కల వాళ్లకు కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అక్కడున్న వాళ్లను అడిగి మరీ కొనిస్తుంది. అంతేకాదు.. వీధుల్లో కనిపించే పేదపిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఇస్తుంటుంది. ఒకసారి చలితో బాధపడుతున్న పిల్లలకు స్వెటర్లు, క్యాప్‌‌‌‌‌‌‌‌లు కూడా ఇచ్చింది. ఆమె మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. 

గొప్ప చరిత్ర 

ఇండియా గురించి ఆమె యూట్యూబ్‌‌‌‌ కమ్యూనిటీ పోస్ట్‌‌‌‌లో.... ‘‘అందరికీ నమస్తే! ఐ లవ్ ఇండియా. ఇండియాలోని వైవిధ్యమైన సంస్కృతి నాకు చాలా నచ్చింది. ఇది అందాల భూమి. మీ గొప్ప చరిత్ర, సంప్రదాయాలు, ఆతిథ్యం నాకు ఇండియా మీద ప్రేమని మరింత పెంచాయి. ఇక్కడి రుచికరమైన ఫుడ్‌‌‌‌ నేనెప్పటికీ మర్చిపోలేను. మీ బిర్యానీ అరోమా, కూరల్లోని కారం, డెజర్ట్‌‌‌‌ల్లో తీపి... నోరూరించే రుచికరమైన వంటకాలు నన్ను కట్టిపడేశాయి.

వీటన్నింటికీ మించి ఇక్కడి ప్రజల దృఢత్వం, కష్టపడి పనిచేసే గుణం, మంచితనం చాలా గొప్పవి. ఇక్కడివాళ్లు ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నా.. ముఖాలపై చిరునవ్వుతో పలకరిస్తారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిజమైన అర్థాన్ని ఇక్కడి ప్రజలే నాకు నేర్పారు” అంటూ రాసింది.