ఈ సైకో గాళ్ళను నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు: వైఎస్ భారతికి మద్దతుగా షర్మిల ట్వీట్

ఈ సైకో గాళ్ళను నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు: వైఎస్ భారతికి మద్దతుగా షర్మిల ట్వీట్

వైసీపీ అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గురువారం ( ఏప్రిల్ 10 ) కిరణ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు గుంటూరు పోలీసులు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వైఎస్ భారతికి మద్దతుగా చేసిన ట్వీట్  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సైకో గాళ్ళను నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. 

భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని... ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని అన్నారు షర్మిల. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదని... తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానని అన్నారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని... ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని అన్నారు షర్మిల.

ALSO READ : చేబ్రోలు కిరణ్ పై దాడి.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్..

వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని.. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే అని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని... రక్త సంబంధాన్ని మరిచారని అన్నారు. 

రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని.. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారని.. అక్రమ సంబంధాలు అంటగట్టారని.. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని ఎక్స్ వేదిక పిలుపునిచ్చారు షర్మిల.