చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే లడ్డూ వివాదం.. షర్మిల

చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే లడ్డూ వివాదం.. షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ వివాదంపై స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదం గురించి ముందే తెలిసినా చంద్రబాబు ఎందుకు ఉరుకున్నారని ప్రశ్నించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే 100రోజుల తర్వాత ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారా అని ప్రశ్నించారు షర్మిల.

తిరుమల లడ్డూ శ్రీవారి భక్తుల మనోభావాలకు చెందిందని, ఈ వివాదాన్ని చంద్రబాబు తేలిగ్గా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. విషయం ముందే తెలిసినా ఎందుకు ఉరుకున్నారని, కేవలం రాజకీయం కోసమే ఈ వివాదాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు షర్మిల.

ఈ అంశంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని, తప్పు జరిగిందా లేదా అన్నది తేల్చాలని కోరతామన్నారు. తప్పు జరిగితే దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు షర్మిల..