
వైసీపీపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదని... ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు గారు కనిపించడం చాలా బాధాకరమని అన్నారు. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనమని... స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు షర్మిల.
11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదని మండిపడ్డారు షర్మిల. నిజాలు జీర్ణించుకోలేని మీరు..ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయ్యిందని అన్నారు. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసని... ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసని... తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఫైర్ అయ్యారు షర్మిల.
YCPకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు గారు కనిపించడం చాలా బాధాకరం. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే,…
— YS Sharmila (@realyssharmila) April 7, 2025
ప్యాలెస్ లు కట్టుకున్నారని... సొంత ఖజానాలు నింపుకున్నారని... ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని అన్నారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారని... మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారని అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడిందని అన్నారు షర్మిల.
ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదని... పులి బిడ్డ పులిబిడ్డే అని అన్నారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవేనని ఎద్దేవా చేశారు షర్మిల. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందని... ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు షర్మిల.