
- ముందు ఇక్కడి ఫ్యాక్టరీలు ఓపెన్ చెయ్
- తర్వాత పక్క రాష్ట్రాల ఫ్యాక్టరీలు కాపాడు : కేసీఆర్పై షర్మిల ఫైర్
హైదరాబాద్, వెలుగు : ముందు సొంత రాష్ట్రంలోని ఫ్యాక్టరీలను ఓపెన్ చేయాలని, ఆ తర్వాత పక్క రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీలను కాపాడాలని సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. ‘‘తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ.. కేసీఆర్ పక్క రాష్ట్రాల్లో కంపెనీలను కాపాడే పనిలో పడ్డాడు. ప్రైవేటీకరణ కాకుండా ఆపుతడట. రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతాడట. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటాడట. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది.. ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా ” అని మంగళవారం షర్మిల ట్విటర్లో సీఎంను ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో నిజాం షుగర్స్ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఉద్యమంలో చెప్పి.. అధికారంలోకి వచ్చి తొమ్మిది ఏండ్లు అవుతున్నా ఇంత వరకు ఓపెన్ చేయలేదని గుర్తు చేశారు. కేసీఆర్.. చేతకాని సీఎం అని హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. అజంజాహీ మిల్స్, పేపర్ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొస్తానని దగా చేసిండని, ఎన్నడో మూతపడిన ఐడీపీఎల్, హెచ్ఎం టీ, హెచ్ సీఎల్ , ఆల్విన్, ప్రాగటూల్స్ లాంటి కంపెనీలను తెరిపించడం చేతకాలేదని ఆమె ఆరోపించారు. ముందుగా ఇక్కడ మూత పడిన పరిశ్రమలను తెరిపించి, రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలన్నారు. ‘‘దమ్ముంటే కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించు. కేంద్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తదన్న మీ హామీని నిలబెట్టుకో” అని ఆమె డిమాండ్ చేశారు.