
దుబాయ్: ఇండియా టెన్నిస్ స్టార్ యూకీ భాంబ్రీ తన కెరీర్లో గుర్తుండిపోయే విజయం సొంతం చేసుకున్నాడు. దుబాయ్ టెన్నిస్ చాంపియన్షిప్ మెన్స్ డబుల్స్లో ఆస్ట్రేలియా పార్ట్నర్ అలెక్సీ పాపిరిన్తో కలిసి బరిలోకి దిగిన యూకీ వరల్డ్ నంబర్ వన్ జోడీ మార్సెలో అరెవలో–మేట్ పవిచ్ను ఓడించి సంచలనం సృష్టించాడు.
మంగళవారం జరిగిన తొలి రౌండ్లో యూకీ–పాపిరిన్ ద్వయం 4–6, 76 (7/1), 10–3తో టాప్ సీడ్స్ మార్సెలో (సాల్వెడార్)–పవిచ్ (క్రొయేషియా)పై ఉత్కంఠ విజయం సాధించింది. ఇదే రౌండ్లో ఇండియాకు చెందిన విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెలియన్ జోడీ 4–6, 6–7 (6/8)తో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–జెమీ మర్రే (ఇంగ్లండ్) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది.