
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు ఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. జూన్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు అంబాసిడర్గా నియమించింది. ఇండో–పాక్ పోరుతో సహా అమెరికాలో జరిగే అన్ని మ్యాచ్ల ప్రమోషన్ బాధ్యతలను యువీకి అప్పగించారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్తో కలిసి అతను పని చేయనున్నాడు. ఇలాంటి మెగా ఈవెంట్లో మరోసారి భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని యువీ అన్నాడు. టోర్నీ అంబాసిడర్గా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం వంటి మధురమైన జ్ఞాపకాలు టీ20 వరల్డ్కప్లో ఉన్నాయన్న యువీ.. ఇండో–పాక్ మ్యాచ్ను ఈ ఏడాది జరగబోయే అతిపెద్ద క్రీడా సంగ్రామంగా అభివర్ణించాడు. జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో టీ20 వరల్డ్కప్ జరగనుంది. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. జూన్ 9న న్యూయార్క్ వేదికగా ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.