తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్‌కు లేదు: వైవీ సుబ్బారెడ్డి

తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్‌కు లేదు: వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారిన వైఎస్ ఫ్యామిలీ ల్యాండ్ ఇష్యూస్‎పై వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (అక్టోబర్ 25) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్‌కు లేదని.. వాస్తవాలు చెప్పేందుకే జగన్‌ ఎన్సీఎల్టీని ఆశ్రయించారని క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ అక్రమ కేసుల్లోనే జగన్ జైలుకెళ్లారని.. అతడి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిందని అన్నారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేసే జైలుకు పంపించేందుకు మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ | అసలు మా ఫ్యామిలీలో ఏం జరుగుతుందంటే.. ఆస్తుల గొడవపై షర్మిల 3 పేజీల బహిరంగ లేఖ

 ఎన్సీఎల్టీలో జగన్‌ పిటిషన్ వేయకపోతే.. బెయిల్ రద్దు చేయాలని టీడీపీ నేతలు పిటిషన్ వేస్తారని అన్నారు. టీడీపీ కుట్రలో వైఎస్ షర్మిల పావుగా మారిందన్నారు. వైఎస్ ఆస్తుల్లో షర్మిలకు వాటాలు ఉంటే.. అక్రమాస్తుల కేసులో ఈడీ ఆమెపై కేసులు ఎందుకు పెట్టలేదు.. జగన్ ఒక్కడే ఎందుకు జైలుకు వెళ్లాడని ప్రశ్నించారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నా కూడా కుట్రలో భాగంగానే సరస్వతి పవర్ లిమిటెడ్ కంపెనీ షేర్లను షర్మిల బదలాయించారని.. అందుకే జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించాడని.. అంతేకానీ తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్‌కు లేదు స్పష్టం చేశారు. ఆస్తుల కోసమే షర్మిల రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.