భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ
  • జిల్లాలో లోకల్​ బాడీ ఎన్నికల ఓటర్లు  6,81,174 మంది 
  • అత్యధికంగా బూర్గంపహడ్​ మండలంలో 50,420 మంది
  • ఆళ్లపల్లి మండలంలో అతి తక్కువగా 9,285 మంది ఓటర్లు 
  • 236 ఎంపీటీసీలకు 1,253పోలింగ్​ స్టేషన్లు 
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్​ల ఫోకస్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జిల్లా ప్రజాపరిషత్​ ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు.  ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ప్రజా పరిషత్​ ఆఫీసర్లు సోమవారం ప్రకటించారు. జిల్లాలో 6,81,174 మంది ఓటర్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషుల కంటే 18,480 మంది   మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బూర్గంపహడ్​ మండలంలో  అత్యధికంగా 50,420 మంది ఓటర్లు ఉన్నారు. ఆళ్లపల్లి మండలంలో అతి తక్కువగా 9,285 మంది ఓటర్లు నమోదు అయ్యారు. 

మొత్తం 1253 పోలింగ్​ కేంద్రాలు 

జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ  స్థానాలకు  1,253పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు.     3,31,336 మంది పురుషులు 3,49,816 మంది మహిళా ఓటర్లు,  22 మంది థర్డ్​ జెండర్​ ఓటర్లున్నారు . ఓటర్ల జాబితాలను మండల ప్రజా పరిషత్​ ఆఫీస్​లలో   అందుబాటులో ఉంచారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా అందుకు తగ్గట్టుగా సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సూచనల తో  ఇప్పటికే బ్యాలెట్​ పేపర్ల ముద్రణను పూర్తి చేశారు. బ్యాలెట్​ బాక్స్​లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పోలింగ్​ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. 

సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలపై దృష్టి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదాను ఆఫీసర్లు ప్రకటించారు. ఇదే క్రమంలో జిల్లాలో సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాలపై జిల్లా పరిషత్​ ఆఫీసర్లు పోలీస్​లతో చర్చిస్తున్నారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాల వివరాలను తయారు చేస్తున్నట్టు పోలీస్​లు పేర్కొన్నారు.