
సిల్హెట్: ఆల్రౌండ్ షోతో చెలరేగిన జింబాబ్వే.. బంగ్లాదేశ్ను వారి సొంతగడ్డపై ఓడించింది. బుధవారం ముగిసిన తొలి టెస్ట్లో 3 వికెట్ల తేడాతో గెలిచి ఊహించని షాకిచ్చింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో జింబాబ్వే 1–0 లీడ్లో నిలిచింది. జింబాబ్వేకు నాలుగేళ్ల తర్వాత లభించిన తొలి విజయం కావడం విశేషం. బంగ్లా నిర్దేశించిన 174 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు నాలుగో రోజు బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 50.1 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది.
బ్రియాన్ బెన్నెట్ (55), బెన్ కరన్ (44) తొలి వికెట్కు 95 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. వెస్లీ మదెవెరె (19 నాటౌట్), వెల్లింగ్టన్ మసకద్జా (12), నిక్ వెల్చ్ (10), క్రెయిగ్ ఇర్విన్ (10) తలా కొన్ని రన్స్ జోడించి విజయాన్ని అందించారు. మెహిదీ హసన్ మిరాజ్ 5, తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 194/4 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 79.2 ఓవర్లలో 255 రన్స్కు ఆలౌటైంది.
నజ్ముల్ హుస్సేన్ షాంటో (60), జాకెర్ అలీ (58) హాఫ్ సెంచరీలతో రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. బ్లెస్సింగ్ ముజురబాని ఆరు, వెల్లింగ్టన్ మసకద్జా రెండు వికెట్లతో బంగ్లాను కట్టడి చేశారు. మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన ముజురబానికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ ఈ నెల 28 నుంచి చిట్టగాంగ్లో జరుగుతుంది.